Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరి

Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే మెజారిటీ సీట్లను గెలుచుకుంది. ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు భంగపాటు తప్పలేదు.

Update: 2026-03-17 05:07 GMT

Rajya Sabha Elections 2026

Rajya Sabha Elections 2026: రాజ్యసభ ఎన్నికల్లో ఎన్డీయే విజయభేరి మోగించింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 37 రాజ్యసభ స్థానాల ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఎన్డీఏ 22 స్థానాలు గెలుచుకోగా, ప్రతిపక్షం 15 స్థానాలు గెలుచుకుంది. ఈ స్థానాల్లో గతంలో ఉన్న సీట్లలో 10 ప్రతిపక్షాలు కోల్పోయింది. ఎన్డీఏ ఆ 10 స్థానాలుగెలుచుకుంది. ఈ 37 సీట్లలో గతంలో ఎన్డీఏ 12 స్థానాలు, ప్రతిపక్షం 25 స్థానాలు కలిగి ఉండేవి. ఇప్పుడు ఇది దాదాపుగా రివర్స్ అయింది.

ఈ 37 స్థానాలలో, 26 స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక హర్యానా, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లోని 11 రాజ్యసభ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగాయి. వీటిలో తొమ్మిది స్థానాలను ఎన్డీఏ అభ్యర్థులు లేదా ఎన్డీఏ మద్దతు ఉన్న అభ్యర్థులు గెలుచుకున్నారు. కాంగ్రెస్, బిజు జనతా దళ్ (బీజేడీ) చెరో స్థానాన్ని గెలుచుకున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే, బీహార్‌లోని ఐదు స్థానాలనూ ఎన్డీఏ అభ్యర్థులే గెలుచుకున్నారు. ఒడిశాలోని నాలుగు స్థానాలలో మూడింటిని ఎన్డీఏ అభ్యర్థులు, ఒకదాన్ని బీజేడీ గెలుచుకుంది. హర్యానాలోని రెండు స్థానాలలో ఒకదాన్ని బీజేపీ, మరొకదాన్ని కాంగ్రెస్ గెలుచుకున్నాయి.

బీహార్‌లో ఓటు వేయని నలుగురు ఎమ్మెల్యేలు.. ఎన్డీఏకు మరో సీటు..

బీహార్‌లోని ఐదు రాజ్యసభ స్థానాలకు జరిగిన బేరసారాల పోరులో ఎన్డీఏ, మహాకూటమిని ఓడించింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన ఏడీ సింగ్ ఓడిపోయారు. ఎన్డీఏకు చెందిన ఐదుగురు అభ్యర్థులు గెలుపొందారు. వీరిలో జేడీయూ జాతీయ అధ్యక్షుడు సీఎం నితీష్ కుమార్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, ఆర్ఎల్ఎస్పీ జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా, కేంద్ర మంత్రి రామ్ నాథ్ ఠాకూర్, బీజేపీకి చెందిన శివేష్ రామ్ ఉన్నారు. ఇక్కడ రాజ్యసభ ఎన్నికలు పెద్ద రాజకీయ యుద్ధాన్ని తలపించాయి. క్యాంపు రాజకీయాలు.. ప్రలోభాల వలలు అన్నీ ఈ ఎన్నికల సందర్భంగా కనిపించాయి.

నిజానికి, మధ్యాహ్నం వరకు ఆర్జేడీ తమ అభ్యర్థికే విజయం ఖాయమని చెప్పుకుంది. అయితే, సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి, ముగ్గురు కాంగ్రెస్, ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే మహాకూటమి అభ్యర్థికి ఓటు వేయలేదు. ఈ నలుగురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం వల్ల, ఏడీ సింగ్‌కు 41 ఓట్లకు బదులుగా కేవలం 37 ఓట్లు మాత్రమే వచ్చాయి.

హర్యానాలో బీజేపీ ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్..

హర్యానాలోని రెండు రాజ్యసభ స్థానాల ఫలితాలు పోలింగ్ ప్రారంభమైన దాదాపు తొమ్మిది గంటల తర్వాత, ఈ తెల్లవారుజామున 1 గంటకు ప్రకటించారు. బీజేపీకి చెందిన సంజయ్ భాటియా, కాంగ్రెస్‌కు చెందిన కర్మవీర్ బౌధ్ విజయం సాధించారు. బీజేపీ మద్దతుతో పోటీలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి సతీష్ నందల్ ఓడిపోయారు.

ఈ ఎన్నికలో 90 మంది ఎమ్మెల్యేల ఓట్లు పోలయ్యాయి. వీరిలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD)కు చెందిన ఇద్దరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన నాలుగు ఓట్లు, బీజేపీకి చెందిన ఒక ఓటు చెల్లనివిగా ప్రకటించడంతో, 83 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి.

బీజేపీకి 48 ఓట్లు రాగా, వాటిలో ఒకటి రిజెక్ట్ అయింది. భాటియాకు 39 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా, నందల్‌కు 8 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 37 మంది ఎమ్మెల్యేలు ఉండగా, నాలుగు ఓట్లు తిరస్కరించారు. ఐదుగురు క్రాస్ ఓటింగ్ చేయడంతో, 28 ఓట్లు మిగిలాయి.

సంజయ్ భాటియా 27.66% మొదటి ప్రాధాన్యత ఓట్లను పొందారు. స్వతంత్ర అభ్యర్థి నందల్ 27.34% ఓట్లను పొందగా, కాంగ్రెస్ అభ్యర్థి కర్మవీర్ బౌధ్ 28% ఓట్లను పొందారు. ఈ విధంగా, నందల్ కేవలం 0.66% తేడాతో, అంటే ఒక ఓటు కన్నా తక్కువ తేడాతో బౌధ్ చేతిలో ఓడిపోయారు.

అంతకుముందు, ఈ ఓటింగ్ విషయంలో వివాదం చెలరేగింది. సోమవారం, పార్టీ సీనియర్ నాయకుల 'కాపలా'లో ఎమ్మెల్యేలు తమ ఓట్లను వేశారు. గోప్యత విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. క్యాబినెట్ మంత్రి అనిల్ విజ్ ఓట్ల గోప్యతను కాంగ్రెస్ ప్రశ్నించగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పరమ్‌వీర్ సింగ్, భరత్ బెనివాల్‌ల ఓట్ల గోప్యతను బీజేపీ ప్రశ్నించింది. అధీకృత ఏజెంట్లు కాని వ్యక్తులకు ఓట్లను చూపించారనే ఆరోపణలు వచ్చాయి.

కమిషన్ పరంవీర్ ఓటును చెల్లనిదిగా ప్రకటించింది. సాయంత్రం 7 గంటలకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసి, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.

ఒడిశా: బీజేపీ 3 స్థానాలు, బీజేడీ ఒక స్థానం..

ఒడిశాలో, బీజేపీకి చెందిన మన్మోహన్ సమల్, సుజిత్ కుమార్, ఎన్డీఏ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి దిలీప్ రే గెలుపొందారు. నాలుగో స్థానాన్ని బిజు జనతా దళ్ (బీజేడీ)కి చెందిన సంత్రుప్త మిశ్రా గెలుచుకున్నారు. బీజేడీకి చెందిన దత్తేశ్వర్ హోటా ఓడిపోయారు. భువనేశ్వర్‌లో రాజ్యసభ పోలింగ్ సందర్భంగా బీజేడీ, బీజేపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ చెలరేగింది.

Tags:    

Similar News