UAE : భారత్కు గుడ్ న్యూస్.. చమురు కూటమికి యూఏఈ గుడ్ బై.. ఇక చౌకగా పెట్రోల్, డీజిల్
మే 1 నుండి ఓపెక్ కూటమి నుంచి యూఏఈ వైదొలుగుతోంది.
UAE exits OPEC
OPEC: అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో ఊహించని మలుపు చోటుచేసుకుంది. ప్రపంచ చమురు ధరలను శాసించే శక్తివంతమైన కూటమి ఓపెక్ నుంచి వైదొలగాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుండటంతో, గ్లోబల్ ఆయిల్ పాలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. 60 ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని తెంచుకుంటూ యూఏఈ తీసుకున్న ఈ నిర్ణయం.. భారత్ వంటి దిగుమతి దేశాలకు మాత్రం తీపి కబురు అందించనుంది.
యూఏఈ తన చమురు ఉత్పత్తి సామర్థ్యాన్ని రోజుకు 50 లక్షల బ్యారెళ్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, సౌదీ అరేబియా నేతృత్వంలోని ఓపెక్ కూటమి విధిస్తున్న ఉత్పత్తి ఆంక్షలు యూఏఈ ఆర్థిక ప్రయోజనాలకు ఆటంకంగా మారాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కోసమే యూఏఈ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
భారత్కు కలిగేబెనిఫిట్స్ ఇవే
ఇప్పటివరకు ఓపెక్ కోటా వల్ల యూఏఈ తక్కువ చమురును ఉత్పత్తి చేసేది. ఇప్పుడు ఆ ఆంక్షలు లేవు కాబట్టి, ఉత్పత్తి భారీగా పెరుగుతుంది. ప్రపంచ మార్కెట్లో సరఫరా పెరిగితే ఆటోమేటిక్గా ధరలు తగ్గుతాయి. భారత్ తన చమురు అవసరాల్లో 10 శాతం వరకు యూఏఈ నుంచే దిగుమతి చేసుకుంటున్నందున, మన దేశ ఇంధన బిల్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల వల్ల హార్ముజ్ జలసంధి గుండా రవాణా ప్రమాదకరంగా మారింది. అయితే, యూఏఈకి ఉన్న హబ్షాన్-ఫుజైరా పైప్లైన్ ఇప్పుడు భారత్కు వరం కానుంది.
అబుదాబి నుంచి నేరుగా ఒమన్ గల్ఫ్ వరకు ఉండే ఈ 400 కి.మీ పైప్లైన్ ద్వారా, యుద్ధం జరుగుతున్నా సరే.. హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా చమురు నేరుగా అరేబియా సముద్రం మీదుగా భారత్కు చేరుతుంది. సౌదీ అరేబియా ఆధిపత్యానికి గండి కొడుతూ యూఏఈ బయటకు రావడం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరల్లో పోటీ పెరగనుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో భారత్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గి సామాన్యుడిపై భారం తగ్గే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.