COVID 19: మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్త వేరియంట్ గుర్తింపు.
covid 19: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
COVID 19: మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు.. కొత్త వేరియంట్ గుర్తింపు.
covid 19: కరోనా మహమ్మారి యావత్ దేశాన్ని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటికి కనిపించని ఈ మాయదారి వైరస్ వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే ఇది భారత్లో కాదు అమెరికాలో.
కొత్త వేరియంట్ గుర్తింపు
అమెరికాలో ఇటీవల కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వైరస్కు చెందిన BA.3.2 వేరియంట్ అనే కొత్త రూపం బయటపడింది. అమెరికా వ్యాధి నియంత్రణ సంస్థ CDC ప్రకారం ఫిబ్రవరి 11 నాటికి ఈ వేరియంట్ ప్రపంచంలోని సుమారు 23 దేశాల్లో గుర్తించారు. ఈ వేరియంట్లో వైరస్ మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను కొంతవరకు తప్పించుకునే లక్షణం ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. దీంతో మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు.
హైబ్రిడ్ ఇమ్యూనిటీ వల్ల తగ్గిన ప్రమాదం
అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పటి పరిస్థితి 2020–2021 కాలంలో ఉన్నట్లుగా తీవ్రమైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ప్రజలు ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు లేదా కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నారు. దీంతో వారి శరీరంలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ అనే రోగనిరోధక శక్తి ఏర్పడింది. ఈ కారణంగా కేసులు పెరిగినా, తీవ్రమైన పరిస్థితులు లేదా మరణాలు పెరగే అవకాశాలు గతంతో పోలిస్తే తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.
భారత్పై ప్రభావం ఉంటుందా?
అమెరికాలో కేసులు పెరగడం వల్ల భారత్పై ప్రభావం ఉంటుందా అనే ప్రశ్న ఇప్పుడు చాలా మందిలో ఉంది. నిపుణుల మాట ప్రకారం కరోనా వైరస్ పూర్తిగా అంతరించిపోలేదు. ఇప్పుడు ఇది ఎండెమిక్ వైరస్ గా మారింది. అంటే కొన్ని కాలాల్లో కేసులు పెరుగుతాయి, కొన్ని కాలాల్లో తగ్గుతాయి. కొత్త వేరియంట్ కనిపించినంత మాత్రాన మళ్లీ మహమ్మారి స్థాయి పరిస్థితి వస్తుందని అనుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు.
ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?
కొంతమంది మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, ఇప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు, ఇలాంటి వారు ఇన్ఫెక్షన్కు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని వైద్యులు సూచిస్తున్నారు.
భయపడాల్సిన అవసరం లేదు.. కానీ అప్రమత్తత ముఖ్యం
నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇప్పుడే భయపడాల్సిన పరిస్థితి లేదు. గతంతో పోలిస్తే ఆరోగ్య వ్యవస్థ చాలా బలంగా ఉంది. టెస్టింగ్, చికిత్స, వ్యాక్సినేషన్ సదుపాయాలు కూడా మెరుగుపడ్డాయి. అయినా సరే అప్రమత్తత మాత్రం తప్పనిసరి. ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకోవడం, అవసరమైతే పరీక్షలు చేయించుకోవడం, అలాగే సాధారణ జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రస్తుతం భారత్లో పరిస్థితి నియంత్రణలో ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తే పరిస్థితులు మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.