అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు ఇవాళ నాగోల్లోని శ్మశానవాటికలో జరగనున్నాయి. ఉస్మానియాలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ఎల్బీనగర్లోని నివాసానికి తరలించారు. దీంతో విజయారెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించేందుకు భారీగా నేతలు, అధికారులు తరలివస్తున్నారు.
దుండగుడి చేతిలో దారుణంగా సజీవ దహనమైన హైదరాబాద్ నగర శివారు అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దార్ విజయారెడ్డి అంత్యక్రియలు నాగోల్లోని శ్మశానవాటికలో జరగనున్నాయి. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం ఎల్బీనగర్లోని ఆమె నివాసానికి డెడ్బాడీని తరలించారు. దీంతో విజయారెడ్డి భౌతికకాయాన్ని సందర్శించేందుకు నేతలు, ఉద్యోగులు భారీగా తరలివస్తున్నారు.
విజయారెడ్డి భౌతికకాయానికి మంత్రి శ్రీనివాస్గౌడ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, కాంగ్రెస్ సీనియర్నేత వీహెచ్, టీఎన్జీవో సంఘం నేతలు తదితరులు నివాళులర్పించారు. దుండగుడి దాడిని నేతలంతా ముక్తకంఠంతో ఖండించారు.
మరోవైపు విజయారెడ్డి మృతిపట్ల రెవెన్యూ ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పది గంటల వరకు కార్యాలయంలోనే ఉండి తీవ్ర ఒత్తిడితో పని చేస్తున్నామన్నారు. భయం..భయంతో జీవితం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. విజయారెడ్డిని హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
విజయారెడ్డి హత్యపై స్పందించిన రెవెన్యూ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులకు.. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు స్పష్టం చేశారు. విజయారెడ్డి అంతిమయాత్రకు రెవెన్యూ ఉద్యోగులంతా తరలిరావాలని నేతలు పిలుపునిచ్చారు.