జంటను కలిపిన టిక్ టాక్
ప్రస్తుతం ప్రజలందరూ ఎంతగానో ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమాలతో కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రజలందరూ ఎంతగానో ఉపయోగిస్తున్న సామాజిక మాధ్యమాలతో కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఫేస్ బుక్, టిక్ టాక్ ద్వారా దూరమైన కొంత మంది వ్యక్తులు కలుసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ బాలిక తన చిన్నతనంలోనే తప్పిపోగా ఫేస్ బుక్ సాయంతో వారి కుటుంబ సభ్యులను కలుసుకుంది. ఇప్పుడు ఇదే తరహాలో టిక్ టాక్ ద్వారా పదమూడేళ్ల క్రితం అదృశ్యమైన మతిస్థిమితం లేని ఓ వ్యక్తి ఇంటికి చేరుకున్నాడు. దీంతో అతని కుటుంబసభ్యులు ఉద్వేగానికి లోనయ్యారు. పూర్తివివరాల్లోకెళితే నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పెద్ద తండాలో చంద్రు నాయక్ (45) అనే మతిస్థిమితంలేని వ్యక్తి ఉండేవారు.
అతనికి భార్య మారోనా, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నాడు. కాగా సదరు వ్యక్తి పదమూడేళ్లక్రితం అంటే 2007 లో ఇంటినుంచి బయటికి వెళ్లి తప్పిపోయాడు. అలా వెలుతూ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లకు చేరుకున్నాడు. బయటికి వెళ్లిన వ్యక్తి ఇంటికి రాకపోవడంతో చంద్రు కుటుంబ సభ్యులు అతని కోసం ఎంతగానో గాలించారు. అయినా ఆచూకీ తెలియక పోవడంతో చంద్రు చనిపోయి ఉంటాడని భావించి కన్నీరు మున్నీరయ్యారు. కాగా ఈ మధ్య కాలంలో వచ్చిన టిక్ టాక్ లో ప్రతి ఒక్కరు వీడియోలు చేసినట్టుగానే నారాయణపేట గ్రామానికి చెందిన మ్యాకలి రామాంజనేయులు ఖాళీ సమయంలో సెల్ఫోన్లో తరచూ టిక్టాక్ షోలను, చూస్తూ కొన్ని వీడియోలను తీసేవాడు.
అలాగే ఓ రోజు చంద్రు ఫోటోను కూడా తీసి టిక్ టాక్ లో అప్ లోడ్ చేసాడు. ఆ ఫోటోని పెద్దతండా వాసులు చూసి అదృశ్యమైన చంద్రునాయక్ అని గుర్తించారు. వెంటనే అతని కుటుంబ సభ్యులకు తెలిపారు. వీడియోకి సంబంధించిన పూర్తివివరాలను సేకరించి గుడిగండ్లకు శుక్రవారం చేరుకున్నారు అతని కటుంబ సభ్యులు. చంద్రుని గుర్తించిన కుటుంబసభ్యులు ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు. ఏడేళ్ల క్రితం కనిపించకుండా పోయిన వ్యక్తి ఒక్క సారిగా కనిపించడంతో ఆనందంతో మునిగిపోయారు.