మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్లో టికెట్ల వ్యవహారం రచ్చకెక్కుతోంది. బోడుప్పల్లో టీఆర్ఎస్ నేతల ఫోన్ ఆడియో వైరల్ అవుతోంది. మాజీ జడ్పీటీసీ మంద సంజీవరెడ్డి ఓ మహిళా నాయకురాలు మరో నేతతో పార్టీ టికెట్ల చర్చపై సాగిన ఫోన్ సంభాషణ కలకలం రేపుతోంది. మంత్రి మల్లారెడ్డి అందరినీ గెలిపించుకొని కేసీఆర్తో శభాష్ అన్పించుకునేందుకే పైసలు ఉన్న వారికే టికెట్లు ఇస్తున్నట్లు మాట్లాడిన ఆడియో వైరల్గా మారింది. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా తానే మేయర్ అభ్యర్థి అని మంద సంజీవరెడ్డి, బొమ్మకు మురళి, మహిళా నాయకురాలితో బేరసారాలు జరుపుతున్న ఆడియో పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరోపక్క దీనిపై బొమ్మకు మురళి స్పందించారు. 40 లక్షలు ఇస్తే తనకు డిప్యూటీ మేయర్ పదవి అవకాశం ఇస్తామని చెప్పి మంత్రి మల్లారెడ్డి, మంద సంజీవరెడ్డిలు మోసం చేశారని ఆరోపించారు. ఎక్కువ డబ్బులు ఇచ్చిన వారికి సీట్లు కేటాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడిన ఫోన్ రికార్డ్ తన వద్ద ఉన్నాయన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా డబ్బులు ఇచ్చిన వారికే టికెట్లు కేటాయించారని మహిళా నాయకురాలు కనకదుర్గ ఆరోపించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆమె విమర్శించారు.