పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య అధికారులతో సమావేశమైన సీఎం.. తీర్పుపై చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని శనివారం సాయంత్రం హైకోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
కోర్టు తీర్పుపై సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల వాయిదాకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రెండు సార్లు పరీక్షల నిర్వహణ కష్టతరంగా భావించిన సర్కార్ పరిస్థితులు అదుపులోకి వచ్చిన అనంతరం ఒక్కసారే నిర్వహించాలనే ఉద్దేశంతో వాయిదా వేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.