ఆర్టీసీ డిపోల వద్ద టెన్షన్ వాతావరణం
ఉమ్మడి వరంగల్లోని 9 డిపోల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులతో కార్మికుల వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆర్టీసీ డిపోల వద్ద టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. సుదీర్ఘ కాలం కొనసాగిన సమ్మెను తప్పనిసరి పరిస్థితుల్లోనే విరమిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఇవాళ్టి నుండి కార్మికులు డిపోల వద్దకు వెళ్లి విధుల్లో చేరాలని జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం 6 గంటలకే కార్మికులు విధుల్లోకి చేరేందుకు ఆర్టీసీ డిపోల వద్దకు వెళ్లారు. అయితే కార్మికులకు డిపోల వద్ద చుక్కెదురైంది. తెలంగాణలోని అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విధుల్లోకి తీసుకునేది లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్ని ఆర్టీసీ డిపోల దగ్గర 144 సెక్షన్ విధించారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకుంటుంన్నారు. అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ డిపోల దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. భద్రాద్రి కొత్తగూడెం డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లోని హయత్నగర్, జూబ్లీహిల్స్ ఆర్టీసీ డిపోల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. విధులకు హాజరయ్యేందుకు డిపోల వద్దకు ఆర్టీసీ కార్మికులు వస్తున్నారు. అయితే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు.
ఉమ్మడి వరంగల్లోని 9 డిపోల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులతో కార్మికుల వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. అడ్డుకున్న కార్మికులను అదుపులోకి పోలీసులు తీసుకున్నారు.