Weather Update: తెలంగాణలో సెగలు కక్కుతున్న భానుడు.. రానున్న 3 రోజుల్లో 40 డిగ్రీలు!

Telangana Weather Update: ఏప్రిల్, మే నెలలు రాకముందే తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత మొదలైంది.

Update: 2026-03-05 09:12 GMT

Weather Update: తెలంగాణలో సెగలు కక్కుతున్న భానుడు.. రానున్న 3 రోజుల్లో 40 డిగ్రీలు!

Telangana Weather Update: ఏప్రిల్, మే నెలలు రాకముందే తెలంగాణ రాష్ట్రంలో వేసవి తీవ్రత మొదలైంది. గతేడాదితో పోలిస్తే ఈసారి మార్చి నెలలోనే ఎండలు హడలెత్తిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల మేర అదనంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా నివేదికను విడుదల చేసింది.

బుధవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 25 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల మార్కును దాటేశాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి రాష్ట్రంలోనే అత్యధికంగా 37.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలో 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై ఉక్కపోతతో జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

మరో 3 రోజుల్లో 40 డిగ్రీలు!

రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలకు చేరుకునే సూచనలు ఉన్నాయని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.

సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో ఉండే ఎండలు ఈసారి మార్చిలోనే కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో దక్షిణ మరియు మధ్య భారత దేశంలో హీట్ వేవ్స్ (వడగాల్పులు) తీవ్రంగా ఉంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలు, వడగాల్పులు మరియు ఉక్కపోతతో రానున్న రోజుల్లో సామాన్యులకు ఇబ్బందులు తప్పేలా లేవు.

Tags:    

Similar News