Harish Rao: రేవంత్ రెడ్డికి పాలన రాదు.. ఐఏఎస్, ఐపీఎస్లను బెదిరిస్తున్నారు
Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.
Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం రావడం లేదని, అధికారులను పదేపదే బదిలీ చేస్తూ వ్యవస్థను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హరీశ్రావు కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు.
అధికారుల బదిలీలతో పాలన అస్తవ్యస్తం..
"గడిచిన రెండున్నరేళ్లలో ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారు. ఇలా తరచూ బదిలీలు చేయడం వల్ల క్షేత్రస్థాయిలో పాలన కుంటుపడుతోంది. ఒక అధికారి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకునేలోపే వారిని మార్చేస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ (GHMC) కమిషనర్లు నలుగురు మారారంటేనే అర్థం చేసుకోవచ్చు పాలన ఎంత దారుణంగా ఉందో" అని హరీశ్రావు ఎద్దేవా చేశారు.
సీఎం బెదిరింపు ధోరణి..
కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను బెదిరించే ధోరణిలో మాట్లాడారని హరీశ్రావు విమర్శించారు. సీఎంకు లేదా మంత్రులకు నచ్చకపోతే వెంటనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని పేర్కొన్నారు. కొందరికి పోస్టింగులు ఇచ్చి కూడా జాయిన్ చేసుకోకుండా వెయిటింగ్లో పెడుతున్నారని దుయ్యబట్టారు.
బినామీల చిట్టా బయటపెడతాం..
కాంగ్రెస్ నేతల అవినీతిపై కూడా హరీశ్రావు ఘాటుగా స్పందించారు. "కాంగ్రెస్ నేతల అవినీతి భాగోతాలు, వారి బినామీల వివరాలు మా దగ్గర ఉన్నాయి. త్వరలోనే వాటన్నింటినీ ఆధారాలతో సహా బయటపెడతాం" అని హెచ్చరించారు.