స్వప్నం సాకారం అయింది..కేసీఆర్ సారధ్యంలో సువర్ణ తెలంగాణా రూపుదిద్దుకుంది!!

Update: 2020-06-02 14:06 GMT

ఓ స్వప్నం సాకారమైన వేళ. తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరిన వేళ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఫలించిన వేళ. దశాబ్దాల ఉద్యమం.. అరవై ఏళ్ల కల తీరిపోయిన ఆరేళ్లయింది. ఎందరో అమరుల ఆత్మ బలిదానాల తర్వాత, తెలంగాణ సాధన సాధ్యపడింది. దశబ్దాల తొలి దశ, పధ్నాలుగేళ్ల మలి దశ ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో మలుపులు.. మరెన్నో మైలురాళ్లు. తెలుగు జాతి రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవించిన క్రమంలో ఎదురైన సంఘటనలు ఎన్నో. కాలం మదిలో నిక్షిప్తమైపోయిన ఉదంతాలెన్నో.

పొడిచిన పొద్దు మీద నడిచిన కాలంలో తెలంగాణలో ఇప్పుడేం చెబుతోంది? స్వీయపాలన కోసం అహరహం శ్రమించిన తెలంగాణీయులు... స్వపరిపాలనలో ఏమంటున్నారు.?

నా తెలంగాణ కోటి రతనాల వీణ.. అన్నాడు దాశరధి. అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, స్వయం పాలన కోసం దశాబ్దాలుగా సాగిన పోరాటం ఫలించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగిన తీరు... తెలంగాణలో సువర్ణాధ్యాయం. కచ్చితంగా అది ఒక చరిత్ర. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంత సులభంగా జరగలేదు. ఎన్నో పోరాటాలు... పట్టువీడని విక్రమార్కుడిలా సాగించిన మహోద్యమం ఈ ఆవిర్భావానికి అడుగులు వేశాయి.

ఉద్యమం బలపడాలంటే అందుకు కమిట్‌మెంట్ కలిగిన వ్యక్తులు కావాలి. జేఏసీల పాత్ర తెలంగాణ ఉద్యమంలో తిరుగులేనిది. ఎక్కడికక్కడ బృందాలుగా ఏర్పడి.. ఒక పటిష్టమైన చైన్ వ్యవస్థను వారు రూపొందించుకున్నారు.. లాఠీలు విరిగినా, కేసులు పెట్టినా.. చలించలేదు.. తమ రాష్ట్రం.. తమకు రావాలన్న పట్టుదలే వారిని ముందుకు నడిపించింది. రాజకీయ నాయకుల నుంచి ఉద్యమం విద్యార్ధుల చేతిలోకి వెళ్లిపోయాక.. అది మరింత ఉగ్రరూపం దాల్చింది.

కాంగ్రెస్ ఇవ్వాలనుకుంది.. ఇచ్చేసింది.. ఎన్నికలు సరిగ్గా ఆరునెలల ముందు పని మొదలుపెట్టి.. యుద్ధ ప్రాతిపదికన పని పూర్తి చేసేసింది.. అసెంబ్లీ బిల్లును వ్యతిరేకించినా.. తాననుకున్నది యూపిఏ ప్రభుత్వం నెరవేర్చింది. పార్లమెంటులో బిల్లును నెగ్గించుకోవడం దగ్గర నుంచి అది గెజెట్ రూపంలోకి, అపాయింటెడ్ డేగా మారడానికి మధ్య జరిగిన సంఘటనలని ఒకసారి నెమరేసుకుందాం..

ఏమైతేనేం తెలంగాణ గమ్యాన్ని ముద్దాడింది. స్వపరిపాలనలో ఆరేళ్ల పాలనా కాలాన్ని పూర్తి చేసుకుంది. తొలి ముఖ్యమంత్రి తనదైన ముద్ర వేసిన కేసీఆర్‌‌పై అదే అభిమానాన్ని చూపించిన తెలంగాణ ప్రజలు... రెండోసారి ఆయనకే కిరీటం పెట్టారు. టీఆర్ఎస్‌ ద్వారానే ప్రగతి అంటూ పార్టీని పట్టాలెక్కించారు. తొలివిడత పాలనలోనే తన మార్క్‌ చూపించిన సీఎం కేసీఆర్‌... పాలనలో సంస్కరణలు చూపించి... సంక్షేమ ఫలాలను ప్రజలందరి దరికి చేర్చారు.

అరవైఏళ్ల ఉద్యమం.. నలభై ఏళ్ల నాటి ఆందోళనలు.. అన్నీ ఓ ఎత్తు.. కేసీఆర్ నడిపిన పోరాటం ఒక ఎత్తు.. కేసిఆర్ ప్రణాళికలోనే విజయం దాగుంది.. తెలంగాణ వాదులెంతమంది ఉన్నా తనది మాత్రమే నికార్సయిన తెలంగాణ వాదమనే బ్రాండ్ తెచ్చుకోగలిగారు.. యుద్ధంలో అయినా... సంధికి విలువుంటుందేమో కానీ... రాజకీయంలో మాత్రం గెలుపునకు మరో ప్రత్యామ్నాయం లేదు... ఆ నిజం తెలిసిన వ్యక్తి కాబట్టే తెలంగాణ కలను నిజం చేసుకున్నారు. స్వయం పాలన దిశగా తెలంగాణను నడిపిస్తున్నారు.  

Tags:    

Similar News