Telangana Objections on AP Projects: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన తెలంగాణా ప్రభుత్వం

Update: 2020-08-05 06:18 GMT

Telangana Objections on AP Projects: ఏపీ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా నది నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం కనుక ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసింది.

దీంతో అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని బోర్డు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు రంగంలోకి దిగిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆగస్టు 5న ఈ భేటీ ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఈ నెల 20 తరువాత ఈ భేటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ స్పష్టం చేయడంతో ఈ భేటీ వాయిదా పడింది. ఏపీ ప్రభుత్వం టెండర్ల ప్రక్రియను కొనసాగిస్తున్న ఈనేపథ్యంలో నిన్న రాత్రి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. మరో రెండ్రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు జరిగే అవకాశముందని సమాచారం.

Tags:    

Similar News