Telangana High Court: తెలంగాణలో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు

* ట్యాంక్‌బండ్‌లో పీవోపీ విగ్రహాల నిమజ్జనం వద్దన్న హైకోర్టు *ఈ ఒక్కసారి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ సర్కార్ రిక్వెస్ట్‌

Update: 2021-09-13 05:08 GMT

తెలంగాణలో గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Telangana: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ సంవత్సరం యథావిధిగానే హుస్సేన్‌ సాగర్‌లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ విగ్రహాలను హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆలోచించాలని కోరుతున్నామన్నారు మంత్రి తలసాని. ఇప్పటికిప్పుడు వినాయక నిమజ్జనాల కోసం బేబీ పాండ్స్‌ ఏర్పాటు చేయడం కష్టమన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని, ఇంత తక్కువ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.

నిమజ్జనం జరిగిన 48 గంటల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిమజ్జనంపై ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్‌ మోషన్‌ రూపంలో ఈ పిటిషన్‌ను విచారించాలని కోరగా, ధర్మాసనం తిరస్కరిస్తూ, సోమవారం ఉదయం ఇదే విషయాన్ని ధర్మాసనం ముందు నివేదించాలని సూచించింది.

Tags:    

Similar News