తెలంగాణ గౌరవ ప్రతీక బతుకమ్మ : తమిళిసై

Update: 2020-10-23 16:57 GMT

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల జీవనంలో భాగమైన ప్రత్యేక పండుగ బతుకమ్మ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌ దర్భార్‌హాల్‌లో బతుకమ్మ సంబురాలను పురస్కరించుకుని శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్‌ స్వయంగా తెచ్చిన చీరలను మహిళా ఉద్యోగులకు, అలాగే పరివార్‌ మహిళా సభ్యులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ ఆడబిడ్డలు ఇచ్చిపుచ్చుకునే నైవేద్యాలు ఆరోగ్యకరమైనవి, బలవర్థకమైనవన్నారు.

తెలంగాణ ఆడబిడ్డలు ప్రకృతితో, పుట్టినగడ్డతో మమేకమయ్యే ఒక విశిష్ఠమైన సందర్భం ఇదన్నారు. బతుకమ్మను పేర్చడానికి వాడే పూలలో ఔషద గుణాలుంటాయని వాటి నిమజ్జనం ద్వారా చెరువుల్లోని నీరు శుద్ధి అవుతుందని తెలిపారు. వీటి ద్వారా మహిళల్లో పోషకత, ఆరోగ్యం పెంపొందుతాయన్నారు. వచ్చే ఏడాది కొవిడ్‌ రహిత పరిస్థితుల్లో బతుకమ్మ జరుపుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ కె. సురేంద్ర మోహన్‌, జాయింట్‌ సెక్రటరీలు జె. భవానీ శంకర్‌, సీ.ఎన్‌. రఘుప్రసాద్‌, ఇతర అధికారులు, మహిళలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News