రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. రాష్ట్రంలో కరోనా కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ను జూన్ 30 వరకు పొడిగించింది. ఇతర జోన్లలో జూన్ 7 వరకు మాత్రమే లాక్డౌన్ అమలవుతుందని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ 5.0 సంబంధించి శనివారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదివారం సమీక్ష నిర్వహంచారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
అయితే అంతర్ రాష్ట్ర సర్వీసులు నడిపేందుకు మాత్రం ఆర్టీసీ, ప్రైవేటు బస్సులకు అనుమతి ఇవ్వలేదు. ఈ సమావేశంలో హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్కు అనుమతిపై సీఎం ఎలాంటి ప్రకటన చేయలేదు. మెట్రోరైలు, సినిమాహాళ్లు, బార్లు, ఆడిటోరియాలు ప్రస్తావన లేదు. వీటిపై ఒకటి రెండు రోజుల్లో మళ్లీ స్పష్టత ఇచ్చే వీలుంది.
ఇవీ ఆదేశాలు
* వాణిజ్య సముదాయాలు, దుకాణాలు రాత్రి 8 గంటల వరకు మాత్రమే నిర్వహించాలి.
* ఆసుపత్రులు, మెడికల్ దుకాణాలు కొనసాగుతాయి.
* ఇతర రాష్ట్రాలకు రాకపోకలపై నిషేధం ఎత్తివేత. ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదు.
* రాష్ట్రంలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతుంది.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి