TS ECET Counselling: తెలంగాణా ఈ సెట్ కౌన్సిలింగ్.. తేదీలను ప్రకటించిన ప్రభుత్వం

TS ECET Councelling | ఇప్పటికే ఆలస్యమైన విద్యా సంవత్సరాన్ని వీలైనంత వేగంగా పరుగులెత్తించేందుకు అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి.

Update: 2020-09-12 02:27 GMT

Telangana ecet counselling (file photo)

TS ECET Councelling | ఇప్పటికే ఆలస్యమైన విద్యా సంవత్సరాన్ని వీలైనంత వేగంగా పరుగులెత్తించేందుకు అన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని పరీక్షలు నిర్వహించిన వెంటనే ఫలితాలు విడుదల చేయడం, వాటికి సంబంధించిన కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. తాజాగా ఈ సెట్ కు సంబంధించి ఫలితాలను విడుదల చేసిన తెలంగాణా ప్రభుత్వం, ఈ నెల 16 నుంచి కౌన్సిలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. 

తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటించింది . ఈసెట్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్ర‌ ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ నెల 16 నుంచి 23 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్‌ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 19 నుంచి 23 వరకు ఈసెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. 19 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్లు న‌మోదు చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. 28న సీట్లు కేటాయించనున్నారు. అక్టోబర్‌ 6 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలు కానుంది.

తుది విడత వెబ్‌ ఆప్షన్లకు అక్టోబర్‌ 6, 7 తేదీల్లో అవకాశం కల్పించనున్నారు. తుది విడత సీట్ల కేటాయింపు అక్టోబర్‌ 9న జరుగ‌నుంది. అనంతరం స్పాట్‌ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. కాగా, ఈసెట్‌లో ఈ ఏడాది 97.58 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి వెల్లడించారు. కరోనా పరిస్థితుల నేప‌థ్యంలో ఈసారి ఆల‌స్యంగా ఈసెట్ ప‌రీక్ష జ‌రిగింది. ఆగస్టు 31న కొవిడ్‌-19 మార్గదర్శకాలకు అనుగుణంగా ప‌రీక్ష నిర్వ‌హించారు.

Tags:    

Similar News