Ghatkesar Family Suicide Case: ఘట్‌కేసర్ ఫ్యామిలీ సూసైడ్ కేసు... ఒంటరితనమే కారణమా?

Ghatkesar Family Suicide Case: హైదరాబాద్ చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒంటరితనమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Update: 2026-02-02 07:24 GMT

ఘట్‌కేసర్ ఫ్యామిలీ సూసైడ్ కేసు: ఒంటరితనమే కారణమా?

Ghatkesar Family Suicide Case:  చర్లపల్లి–ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటన వెనుక కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, విజయరెడ్డిని ఆత్మహత్యకు దారితీసిన ప్రధాన కారణం ఒంటరితనం కావచ్చని అనుమానిస్తున్నారు. భర్త సురేందర్‌రెడ్డి ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉండటం, పిల్లలు హాస్టల్‌లో చదువుకోవడం వల్ల ఆమె ఒంటరితనాన్ని భరించలేకపోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే, విజయరెడ్డికి ఆర్థిక ఇబ్బందులు గానీ, కుటుంబ లేదా వ్యక్తిగత గొడవలు గానీ లేవని బంధువులు స్పష్టం చేస్తున్నారు.

ఈ ఘటన రెండు రోజుల క్రితం చర్లపల్లి పరిధిలో చోటుచేసుకుంది. విజయరెడ్డి తన ఇద్దరు పిల్లలు విశాల్ రెడ్డి, చేతన రెడ్డితో కలిసి రైల్వే ట్రాక్‌పై ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు.

పోలీసులు విజయరెడ్డి మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని డిజిటల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఆమె పనిచేసే సంస్థకు చెందిన సహచరులను కూడా విచారించారు. ఘటన అనంతరం భర్త సురేందర్‌రెడ్డి దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని పోలీసులకు వివరాలు అందించారు.

విచారణలో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు రోజు, బంధువు మృతి చెందినట్లు చెప్పి విజయరెడ్డి పిల్లలను హాస్టల్ నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఒక పిల్లవాడిని పటాన్‌చెరు నుంచి, మరో పిల్లవాడిని ఘట్‌కేసర్ నుంచి తీసుకువచ్చి రైల్వే స్టేషన్‌కు వెళ్లినట్లు వెల్లడైంది. ముగ్గురూ స్టేషన్‌లో కొంతసేపు అటుఇటు తిరిగిన తర్వాత, ట్రైన్ వచ్చే సమయంలో ట్రాక్‌పైకి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ఘటన స్థలంలో లభ్యమైన పార్కింగ్ స్లిప్‌పై, తమ మృతికి ఎవరూ కారణం కాదని పేర్కొంటూ విజయరెడ్డి సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

Tags:    

Similar News