కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన లక్ష్మీ బరాజ్ను తెలంగాణ సీఎం కేసీఆర్ సందర్శించారు. ప్రాణహిత నది జలాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా లక్ష్మీ బరాజ్ను కేసీఆర్ వీక్షించారు. వ్యూపాయింట్ దగ్గర ఇంజనీరింగ్ అధికారులకు కేసీఆర్ పలు సూచనలు చేశారు. గోదావరి జలాలు వృధా కాకుండా చూసుకోవాలని ఆదేశించారు. వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరుతుంది. ఎప్పటికప్పుడు బ్యారేజీ నుంచి నీటిని తోడుకోవాలని సూచించారు. ఆ తర్వాత కరీంనగర్ చేరుకున్న కేసీఆర్.. కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా అభివృద్ధి సహా ఇతర అంశాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు.
అంతకు ముందు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు సీఎం కేసీఆర్. లక్ష్మీ బరాజ్ సందర్శన కంటే ముందు.. కాళేశ్వర క్షేత్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్ అభిషేకం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్ను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అంతకుముందు పుష్కరఘాట్లో గోదావరిమాతకు పూజలు చేశారు. గోదావరిలో నాణేలు వదిలి.. చీర, సారె సమర్పించారు.