Keesara MRO Nagaraju: తహసీల్దార్ లాకర్ తెరిచిన ఏసీబీ.. అందులో దిమ్మ‌తిరిగిపోయేలా 1.5 కిలోల బంగారం

Keesara MRO Nagaraju: ఏసీబీ చ‌రిత్రలో సంచ‌ల‌నం సృష్టించిన కీసర తహసీల్దార్‌ నాగరాజు రూ.1.1 కోట్ల లంచం కేసులో రోజురోజుకో కొత్త సాక్ష్యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి

Update: 2020-09-02 16:18 GMT

Keesara MRO Nagaraju: ఏసీబీ చ‌రిత్రలో సంచ‌ల‌నం సృష్టించిన కీసర తహసీల్దార్‌ నాగరాజు రూ.1.1 కోట్ల లంచం కేసులో రోజురోజుకో కొత్త సాక్ష్యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ఈ కేసులో విచార‌ణ చేస్తున్న ఏసీబీకి విస్తుకొలిపే నిజాలు తెలుస్తున్నాయి. విచార‌ణ‌లో భాగంగా.. బుధవారం తహసీల్దార్‌ నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు తెరిచారు. ఈ లాకర్‌‌ను తెరవగా అధికారులకు దిమ్మ‌తిరిగిపోయేలా రూ.57 లక్షల పైబడి విలువైన బంగారు, వజ్రాభరణాలను బ‌య‌ట‌ప‌డ్డాయి. వజ్రవైఢూర్యాలతో కూడిన ఆభరణాలు అందులో ఉన్నాయి. వీటన్నింటినీ ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.

తొలుత ఏసీబీ అధికారుల విచారణలో ఎమ్మార్వో నాగరాజు బ్యాంకు లాకర్ గురించి ఎటువంటి వివరాలు తెలుపలేదు. లాకర్ తెరిచేందుకు ఎమ్మార్వో భార్య కూడా అధికారులను తప్పుదోవ పట్టించిందన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు ఎమ్మార్వో నాగరాజుకు చెందిన బ్యాంకు లాకర్‌ను ఏసీబీ అధికారులు బుధవారం తెరిచారు.

ఆగస్టు 14వ తేదీన నాగరాజు ఇంటిపైన దాడి చేసిన సమయంలో ఏసీబీ అధికారులకు ఓ బ్యాంకు లాకర్‌కు చెందిన తాళంచెవి లభించింది. అది నాగరాజు బంధువైన జి.జే.నరేందర్‌ పేరిట అల్వాల్‌లోని సౌత్‌ ఇండియన్‌ బ్యాంకు లాకర్‌గా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించిన సమయంలోనూ నాగరాజు లాకర్‌ విషయంలో సహకరించలేదని సమాచారం. ఎట్టకేలకు సదరు లాకర్‌ను తెరిచిన ఏసీబీ అధికారులకు అందులో 1532 గ్రాముల బంగారు ఆభరణాలు లభించాయి. వాటిని సీజ్‌ చేసిన ఏసీబీ అధికారులు న్యాయస్థానంలో డిపాజిట్‌ చేయనున్నారు.

మరోవైపు నాగరాజు అవినీతిపై రోజురోజుకు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. అతడి బాధితుల్లో సామాన్యుల నుంచి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పుడు వారంతా బయటకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. నాగరాజు వేధింపులకు గురైన ఓ ఎస్పీ ర్యాంకు మాజీ పోలీస్‌ అధికారి మీడియా ముందుకు అతడి అవినీతి బాగోతం వివరించారు. కస్టడీ ముగిసినా దరిమిలా నాగరాజు అక్రమాలపై ఒక్కొక్కరూ బయటకు వస్తున్నారని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.ఇక నాగరాజు వేసిన బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తయ్యాయి. రెండు రోజుల్లో ఏసీబీ న్యాయస్థానం బెయిల్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 

Tags:    

Similar News