రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారిపై వేటు పడింది. గత ఆరు నెలలుగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ.. పశువులకు సక్రమంగా వైద్య సేవలు అందించకపోవడంతో.. ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్... తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేశారు.
గొల్లపల్లి వెటర్నరీ లైవ్ స్టాక్ అధికారి అయిన కొమురయ్య.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పశు వైద్యశాలలో డిప్యూ టేషన్ పై విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆయన గత ఆరు మాసాలుగా విధులను సక్రమంగా నిర్వర్తించకపోవడం, మండల కేంద్రంలోని పశు వైద్యశాలను సమయం ప్రకారం తెరవక పోవడంతో.., రైతులు పశువులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదంటూ గతంలో అనేక సార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అయినా కొమురయ్య పనితీరు మారకపోవడంతో... సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
పశువైద్యాధికారిపై వచ్చిన ఫిర్యాదులపై స్వయంగా.. జిల్లా కలెక్టర్ రంగంలోకి ఎంక్వైరీ చేశారు. స్వయంగా రంగంలోకి దిగారు. ఉదయం పదిన్నర గంటలైనా కార్యాలయం తెరుచుకోకపోవడంతో... సుమారు 40 నిమిషాలకు పైగా అక్కడే ఉంది.. అధికారి కోసం వేచిచూశారు. అయినా వెటర్నరీ అధికారి రాకపోవడంతో.. కలెక్టర్ అతనికి ఫోన్ చేశారు. ఎక్కడున్నావని కలెక్టర్ అధికారిని అడగగా, తాను హాస్పిటల్లోనే ఉన్నానంటూ సమాధానమిచ్చాడు. దీంతో వెటర్నరీ అధికారిని వాట్సాప్లో లొకేషన్ షేర్ చేయమని కలెక్టర్ హుకుం జారీ చేశారు.
అరగంట అయినా లొకేషన్ రాకపోవడంతో.. అక్కడికి వచ్చిన రైతులతో కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడారు. ఇక్కడి పశువైద్యశాలతో ఎలాంటి ఉపయోగం లేదని, పశువులు అనారోగ్యంతో మరణించినా పట్టించుకున్నవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకట రమణ అక్కడికి చేరుకున్నారు. కలెక్టర్.. జిల్లా అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు, వెటర్నరీ అధికారి కొమురయ్యను విధుల నుండి సస్పెండ్ చేశారు.