సుపారీ హత్యలు.. ఈ పదం ఎక్కువగా సినిమాల్లోనో నార్త్ ఇండియా న్యూస్ ఛానల్లోనో వింటుంటాం. కానీ ఇప్పుడు మన దగ్గర కూడా సుపారీ హత్యల గురించి వింటున్నాం. గ్లోబల్ సిటీగా డెవలప్ అవుతున్న హైదరాబాద్లో సుపారీ హత్యలు పెరిగిపోతున్నాయి. నగరంలో నేరాల నియంత్రణకు కొత్త టెక్నాలజీ వాడుతున్న పోలీసులకు ఈ సుపారీ హత్యలు కలవరపెడుతున్నాయి.
ఇప్పటి వరకు సుపారీ నేరాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యేవి. ఇప్పుడు ఈ కల్చర్ అన్ని రాష్ట్రాల్లో చాప కింద నీరులా పాకుతుంది. రీసెంట్గా జరుగుతున్న హత్యలే దీనికి నిదర్శనం. నేరాలు చేయాలంటే యూపీ, బీహార్, మహారాష్ట్ర నుంచి కిరాయి హంతకులను పిలిపించేవారు. కానీ ఇప్పుడు లక్ష రూపాయలకే మర్డర్ చేసే సుపారీ నేరగాళ్లు హైదరాబాద్లో దొరుకుతున్నారు. పరువు హత్యలు, రివేంజ్, ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ లాంటివన్నీ సుపారీ నేరగాళ్లతో చేయిస్తున్నారు.
ఎక్కువగా పరువు హత్యలే జరుగుతున్నాయి. చందానగర్ పరువు హత్యలో సుపారీ నేరస్థులే హేమంత్ని చంపేశారు. హేమంత్, అవంతిలు లవ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత అవంతి తండ్రి, మేనమామలు హేమంత్ని చంపాలని నిర్ణయించుకున్నారు. దీంతో సిటీకి చెందిన సుపారీ గ్యాంగ్ని మీట్ అయ్యారు. పది లక్షలకు హేమంత్ని చంపడానికి బేరం కుదుర్చుకున్నారు. దీనిలో భాగంగా లక్ష రూపాయలను సుపారీ నేరగాళ్లకు అడ్వాన్స్గా ఇచ్చారు. ఎరుకల కృష్ణ, మొహమ్మద్ పాషా, జగన్, సయ్యద్ ఈ నలుగురు సుపారీ మర్డర్ చేయడానికి యుగేంధర్రెడ్డితో ఒప్పందం కుదర్చుకున్నారు.
యుగేందర్రెడ్డితో ఎరుకల కృష్ణ, పాషాలు కార్లో హేమంత్ని కొడుతూ జహీరాబాద్ రూట్లో తీసుకెళ్లారు. అక్కడ సుతిల్ తాడు కొని అతని చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు పెట్టి గొంతుకి తాడు బిగించి చంపేశారు. హేమంత్ బాడీని సంగారెడ్డి దగ్గరలోని కిష్టారెడ్డిగూడ దగ్గర ఓపెన్ ప్లేస్లో వేసి నైట్ తిరిగి హైదరాబాద్కి వచ్చేశారు.
పోలీసులంటే భయం ఉండదు. పగలు, ప్రతీకారాలు కూడా ఉండవు. పైసల కోసమే ప్రాణాలు తీసేస్తారు. పైసలిస్తే చాలు ఎవరినైనా హతమార్చే సుపారీ కిల్లర్స్ రోజురోజుకూ పెరిగిపోతున్నారు. పరువు, ప్రతిష్టలు, ఆర్థిక లావాదేవీలు, గొడవల వంటివాటిని అవకాశంగా తీసుకుని నడిరోడ్డుపై నిండు ప్రాణాలకు ఖరీదు కడుతున్నారు. వ్యక్తిని చంపడానికి కిరాయి హంతకులతో డీల్ కుదుర్చుకుని, డబ్బులు ఇవ్వడాన్నే సుపారీ అంటారు. ముంబై మాఫియా అడ్డాగా దేశవ్యాప్తంగా హిట్ మెన్ సుపారీ నెట్వర్క్ ను పెంచుకుంటున్నాయి ఈ సుపారీ గ్యాంగ్లు. టార్గెట్ కెపాసిటీకి అనుగుణంగా కోటికి తగ్గకుండా డీల్ సెట్ చేసుకుని మర్డర్కి స్కెచ్ వేస్తున్నాయి.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పరువు హత్య కేసులో కూడా సుపారీ నేరగాళ్లే ప్రణయ్ని హత్య చేశారు. ప్రేమ విహహం చేసుకున్న ప్రణయ్ని 2018 సెప్టెంబర్ 14న మిర్యాలగూడలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద గొంతు కోసి హత్య చేశారు. తన కూతురు అమృత వర్షిణి ప్రేమ వివాహం తట్టుకోలేని మారుతీరావు కిరాయి హంతకులతో ప్రణయ్ని హత్య చేయించాడు. ఇందుకోసం పదిలక్షల రూపాయలు అడ్వాన్స్గా ఇచ్చాడు. బీహార్కి చెందిన సుపారీ గ్యాంగ్ ద్వారా ప్రణయ్ని హత్య చేయించారు. హైదరాబాద్కి చెందిన అబ్దుల్ కరీం ద్వారా బీహార్కి చెందిన మొహమ్మద్ బారీ, అస్గర్అలీ ఈ హత్యలు చేశారు. అబ్దుల్కరీంను అమృత బాబాయ్ శ్రవణ్ కలిసి బేరం కుదుర్చుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఈ కేసులో ఉన్న గ్యాంగ్ని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఇక వారం రోజుల క్రితం రాయదుర్గం పీఎస్లో పనిచేసే ఓ కానిస్టేబుల్ తన బావను సుపారీ గ్యాంగ్తో హత్య చేయించాడు. కానిస్టేబుల్ షౌకత్ చెల్లిని పెళ్లి చేసుకున్న జాకెర్ని ఐదు లక్షల రూపాయల సుపారీ ఇచ్చి చంపించాడు. సిటీలోని హసన్నగర్కి చెందిన సాజిద్, అస్లంఖాన్, షఫీ, శిఖాలు అతడ్ని చంపేశారు. అయితే కానిస్టేబుల్ తోపాటు ముగ్గురు సుపారీ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
10 లక్షల రూపాయల నుంచి కోట్ల వరకూ డీల్స్ మాట్లాడుకుంటూ హత్యలు చేస్తున్నారు. గతంలో ముంబై, ఢిల్లీ, యూపీ, బీహార్ వంటి ప్రాంతాలకే పరిమితమైన సుపారీ గ్యాంగ్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇటీవల మన రాష్ట్రంలోనూ ముంబై మాఫియా తరహా సుపారీ హత్యలు పెరుగుతుండటంతో హైదరాబాద్ సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రంలోని పాత నేరస్తులు సైతం కిరాయి హంతకులుగా మారుతుండటంతో వారి కోసం వేట మొదలుపెట్టారు.