Telangana: తెలంగాణకు వడగాలుల ముప్పు.. నేడు, రేపు పెరగనున్న ఎండలు
Telangana: నేడు, రేపు పెరగనున్న ఎండలు.. వడగాలుల ముప్పు..
Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరుగుతోంది. ఇవాళ, రేపు ఉష్టోగ్రతలు మరింత పెరగనున్నాయమని వాతావరణశాఖ స్పష్టం చేసింది. రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా రేపు కొన్ని జిల్లాల్లో మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.
నిన్న సూర్యుడు నిప్పులుకక్కాడు. రాష్ట్రమంతటా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడితో జనం అల్లాడారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైన నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది.