తెలంగాణలో సరిపడా యూరియా నిల్వలు : మంత్రి తుమ్మల
రాష్ట్ర రైతులకు రబీ సీజన్ కోసం అవసరమైనంత యూరియా నిల్వ రాష్ట్ర ప్రభుత్వ వద్ద పూర్తిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు రబీ సీజన్ కోసం అవసరమైనంత యూరియా నిల్వ రాష్ట్ర ప్రభుత్వ వద్ద పూర్తిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఫెర్టిలైజర్ (యూరియా) యాప్, యూరియా పంపణీలపై చీఫ్ సెక్రటరీ, స్పేషల్ చీఫ్ సెక్రటరీ కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఈ రబీకి కేంద్ర ప్రభుత్వం మొత్తం 10.40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందని, అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు రావాల్సిన 5.60 లక్షల మెట్రిక్ టన్నులకు 5.70 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రానికి చేరుకున్నట్లు వివరించారు. గత సంవత్సరం ఇదే సమయానికి 2.81 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అమ్మకాలు జరగగా, ఈ సీజన్లో రోజుకు సగటుగా 8,692 మెట్రిక్ టన్నుల చొప్పున మొత్తం 3.72 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులు కొనుగోలు చేశారని తెలిపారు. ఇది గత సీజన్ కంటే 92 వేల మెట్రిక్ టన్నులు అధికం అని మంత్రిగారు పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా నిల్వగా ఉన్నట్లు తెలిపారు.
వ్యవసాయ శాఖ ప్రవేశపెట్టిన ఫెర్టిలైజర్ (యూరియా) యాప్ ను ఆదిలాబాద్, మహబూబ్ నగర్, జనగామ, నల్లగొండ, పెద్దపల్లి జిల్లాల్లో డిసెంబర్ 20 నుండి అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఈ ఐదు జిల్లాల్లో 82,059 మంది రైతులు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసి 2,01,789 యూరియా బస్తాలు కొనుగోలు చేశారు. యాప్ ప్రారంభించిన కేవలం 9 రోజుల్లోనే ఈ జిల్లాల్లో రోజుకు 22,000కు పైగా బస్తాలు పంపిణీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా యూరియా యాప్ అమలులో ఉన్న జిల్లాల కలెక్టర్లతో మంత్రి మాట్లాడి, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అప్పుడప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పరిష్కరిస్తున్నారని, రైతులు కూడా యూరియా యాప్ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. యాప్ అనేది కేవలం రైతుల సౌకర్యార్థం తెచ్చినది మాత్రమే, దీని ద్వారా యూరియా అమ్మకాలు పారదర్శకంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఇప్పటికే కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి అమ్మకాలు సులభంగా చేసుకోగలుగుతున్నారని, అదే దిశలో ఈ యాప్ ని తీసుకురావడం జరిగిందని తెలియజేశారు. యాప్ అమలులో ఉన్న జిల్లాలు కాని, అమలులో లేని జిల్లాలలో కాని యూరియా సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మంత్రి ఆదేశించారు.
ఈ సమావేశంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి, కోఆపరేటీవ్ అడిషనల్ రిజిస్ట్రార్ చంద్రమోహన్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.