తెలుగు పాత్రికేయ రంగంలో చెరగని ముద్ర వేసుకున్న ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి.. పత్రికా రంగంలో దాదాపు 60 ఏళ్లుగా ఉన్నారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తి ప్రారంభించారు.
తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ఆంధ్రప్రభ తదితర పత్రికల్లో పని చేశారు. 2000లో 'నాటి పత్రికల మేటి విలువలు' పేరిట పుస్తకం రచించారు. అలాగే 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించారు పొత్తూరి.. పీవీ గురించి రాసిన 'ఇయర్ ఆఫ్ పవర్'కు సహ రచయితగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు ప్రెస్ అకాడమీ చైర్మన్గా పనిచేశారు. ఆయన మృతి పత్రికా రంగానికి తీరని లోటుగా పలువురు సీనియర్ జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఇక పొత్తూరి మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం తెలిపారు. అలాగే ఆయన మరణం తీరని లోటని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు.