'సమత' కేసు నిందితుల తరఫున న్యాయవాది నియామకం
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇదే కోణంలో ఇటీవల దిశ హత్యకేసు సంచలనం సృష్టించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇదే కోణంలో ఇటీవల దిశ హత్యకేసు సంచలనం సృష్టించింది. అదే తరహాలో రాష్ట్రంలో మరో కేసు కూడా దాఖలైంది. అదే సమత హత్య కేసు. ఈ కేసులో నిందితులను రెండు రోజులుగా కోర్టుకు హాజరు పరుస్తు్న్నారు. అయినప్పటికీ నిందితుల తరుఫున వాదించడానికి న్యాయవాదులు ఎవరూ ముందుకు రావడంలేదు. దీంతో కోర్టు నిందితుల తరుఫున వాదించడానికి న్యాయవాది రహీంను నియమించింది.
కోర్టు ఆదేశాల మేరకు రహీం ఈ కేసును వాదించేందుకు అంగీకరించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న నిందితులు షేక్ బాబు, షేక్ షాబొద్దీన్, షేక్ ముగ్దూమ్లను బుధవారం మరోసారి కోర్టులో హాజరు పర్చనున్నారు. ఈ నేపథ్యంలోనే నిందితులకు సంబంధించిన కేసు పత్రాలను న్యాయవాది రహీం స్వీకరించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో పోలీసులు 44 మంది సాక్షులను విచారించారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట న్యాయస్థానం తీర్పు వెలువరించనుంది. ఈ నెల 19న కోర్టులో ఈ కేసు ట్రయల్ కు వచ్చే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రమణారెడ్డి, నిందితుల తరపున వాదించే న్యాయవాది రహీం తెలిపారు.