కొత్తపల్లిలో బోనులో చిక్కిన చిరుత
కొన్ని రోజులుగా కొత్తపల్లి పరిసరాల్లో చిరుత సంచారం
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలంలో గత కొన్ని రోజులుగా లేగ దూడలను హతమారుస్తూ... ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు అటవీశాఖ అధికారుల బోనుకు చిక్కింది. మండల పరిధిలోని నందిగామ, దుప్పటిగట్టు, గోకుల్నగర్, గొర్లోనిబావి పరిసరాలలో గత కొన్ని వారాలుగా సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీంతో స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. లేగ దూడలను హతమార్చిన విధానాలు, పాదముద్రలను సేకరించిన అధికారులు చిరుతపులిగా గుర్తించారు. సోమవారం రాత్రి నందిగామ పరిసర ప్రాంతాలలో చిరుత ఉన్నట్లు గుర్తించి... బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు చిరుత బోనులో చిక్కడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా బోనులో చిక్కిన చిరుతను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నట్లుగా అటవీశాఖ అధికారులు తెలిపారు.