తెలంగాణలో కరోనాతో మరొకరు మృతి
తెలంగాణలో కరోనా మహమ్మారికి మరొకరు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2కు చేరింది.
తెలంగాణలో కరోనా మహమ్మారికి మరొకరు బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 2కు చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మూడు రోజుల క్రితం తెలంగాణలో తొలి మరణం సంభవించినట్లు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మరణం సంభవించింది. అయితే, చనిపోయిన వారు ఏ ప్రాంతం వారన్న వివరాలు తెలియజేయలేదు.
మరోవైపు ఇవాళ ఒక్క రోజే ఆరు పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 77 చేరగా.. అందులో 14 మందిని డిశ్చార్జి చేశారు. తొలి కరోనా బాధితుడు ఇదివరకే డిశ్చార్జి అవ్వగా.. ఇవాళ మరో 13 మందిని డిశ్చార్జ్ చేశారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 61 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. మార్చి 2న తెలంగాణలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది.