1000 Fine For No Mask : మాస్క్ పెట్టుకోకపోతే ఫైన్ కట్టాల్సిందే.. తెలంగాణలో కఠిన నిబంధనలు

Update: 2020-07-04 09:09 GMT

RS 1000 Fine For Not Wearing Mask in Telangana : తెలంగాణలో కరోనా స్వైర విహారం చేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో మహమ్మారి విజృంభణ మరీ ఆందోళనకరంగా మారింది. ఈ తరుణంలో కరోనా కట్టడికి కఠిన నిబంధనలను తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మాస్కులు ధరించని వారికి వెయ్యి రూపాయల జరిమానాతో పాటు ఈ-పెట్టీ కేసులను నమోదు చేస్తున్నారు పోలీసులు.

కరోనా ఉధృతితో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్కు ధరించాలని ప్రత్యేక జీవోను జారీ చేసింది. ఈ నేపథ్యంలో స్వీయ నియంత్రణపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 67 వేల 557 మందిపై ఈ-పెట్టీ కేసులను, మరో 3వేల 288 మందికి ఈ-చలాన్లను జారీ చేశారు పోలీసులు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ లోనే 14వేల 931 కేసులు నమోదవగా, తర్వాతి స్థానంలో రామగుండం కమిషనరేట్ 8వేల 290, ఖమ్మం 6వేల 372, సూర్యాపేట్ 4వేల 213, వరంగల్ 3వేల 907 ఉన్నాయి. అత్యల్పంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 173 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ప్రభుత్వం జీవోలు జారీ చేసినా పోలీసులు జరిమానాలు విధించినా ప్రజల బాగు కోసమేనని గుర్తించి అందరూ కరోనా నియంత్రణ పట్ల ఏకతాటిపై వచ్చి మహమ్మారిని కట్టడి చేసే అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News