పశ్చిమ విదర్భ నుంచి కోస్తా కర్నాటక వరకు మరాఠ్వాడ, మధ్యమహారాష్ట్ర మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితలద్రోణి ఏర్పడినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో నేడు రేపు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ద్రోణి కారణంగా రాగల రెండురోజుల్లో హైదరాబాద్ లోని
పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్టు అధికారులు స్పష్టం చేశారు. కాగా నాలురోజుల కిందటే హైదరాబాద్ లో వర్షం కురిసింది. దాని ప్రభావంతో వాతావరణం రెండురోజుల పాటు చల్లబడింది. ఈ క్రమంలో మళ్ళీ ఎండలు పుంజుకున్నాయి. ఎండలతో అల్లాడుతున్న జనాలకు ఈ వర్షం వార్త ఊరటనిచ్చే అవకాశమే అని అభిప్రాయపడుతున్నారు.