Fake Gold Scam: నల్గొండలో నకిలీ బంగారం మోసం.. రూ.7 లక్షల టోపీ
Fake Gold Scam: నల్గొండ జిల్లా శాలిగౌరారంలో నకిలీ బంగారంతో రూ.7 లక్షలు మోసం. వరదల్లో దొరికిందని నమ్మబలికి బాధితుడిని టార్గెట్ చేసిన ముఠా అరెస్ట్
Fake Gold Scam in Nalgonda: నల్గొండలో నకిలీ బంగారం మోసం.. రూ.7 లక్షల టోపీ
Fake Gold Scam: నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం రామానుజపురంలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. వరదల్లో దొరికిన బంగారమని నమ్మబలికి నకిలీ ఆభరణాలను అమ్మి ఏకంగా రూ.7 లక్షలు దోచుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. విజయవాడ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు మరో వ్యక్తితో కలిసి ముఠాగా ఏర్పడి గ్రామాల్లో సంచరిస్తున్నారు. బాతులు మేపుతామంటూ ఆటోలు, బైక్లపై తిరుగుతూ అమాయకులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రామానుజపురానికి చెందిన ఓ వ్యక్తిని టార్గెట్ చేశారు.
విజయవాడ వరదల్లో తమకు బంగారు ఆభరణాలు దొరికాయని, అత్యవసరంగా డబ్బులు కావడంతో తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారు. నమ్మకం కలిగించేందుకు మొదట అసలు బంగారాన్ని శాంపిల్గా చూపించారు. అది నిజమని భావించిన బాధితుడు మొత్తం రూ.7 లక్షలు చెల్లించి మిగతా ఆభరణాలను కొనుగోలు చేశాడు.
నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత ఆ ఆభరణాలను పరీక్షించగా అవి బంగారం కాకుండా ఇత్తడి అని తేలింది. మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు మేరకు శాలిగౌరారం పోలీసులు గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ అపరిచితులు వస్తే నమ్మవద్దని సీఐ కొండల్ రెడ్డి ప్రజలను హెచ్చరించారు.