ప్రముఖ కవి, జర్నలిస్టు దేవిప్రియ కన్నుమూత

Update: 2020-11-21 05:07 GMT

ప్రముఖ కవి, జర్నలిస్టు దేవిప్రియ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు సాహితీ లోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

తాడికొండకు చెందిన దేవిప్రియ ఉదయం వంటి పలు పత్రికల్లో పనిచేశారు. ఆయన అమ్మచెట్టు, నీటిపుట్ట, చేప చిలుక, తుఫాను తుమ్మెద, గరీబు గీతాలు, సమాజాంద స్వామి వంటి పలు రచనలను వెలువరించారు. గాలి రంగు అనే గ్రంథానికి ఆయనకు 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

దేవిప్రియ పార్థివదేహం సికింద్రాబాద్‌లోని ఆల్వాల్‌లో నివాసానికి తరలించారు. మధ్యాహ్నం తిరుమలగిరి స్మశానవాటికలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.

దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15న జన్మించారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్, తండ్రి షేక్ హుస్సేన్ సాహెబ్, తల్లి షేక్ ఇమామ్ బీ. గుంటూరులోని ఏసీ కాలేజీలో బిఎ చదువుకున్నారు. సాహిత్యరంగంలో ఆయన దేవీప్రియగా ప్రసిద్ధి పొందారు. తన సాహిత్యాన్నంతా ఆయన దేవిప్రియ పేరుతో వెలువరించారు. హెచ్ఎంటీవీ స్థాపించిన మొదట్లో రన్నింగ్‌ కామెంటరీ పేరుతో ఆయన చానల్‌కు సేవలందించారు.

కాలేజీ రోజుల్లోనే ఆయన సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు. గుంటూరు కేంద్రంగా అవతరించిన పైగంబర కవులు బృందంలో ఆయన చేరారు. జర్నలిస్టుగా ఆయన ప్రజావాహిని, నిర్మల, ప్రజాతంత్ర, జ్యోతి, మనోరమ తదితర పత్రికల్లో పనిచేశారు. ఉదయం, హైదరాబాద్ మిర్రర్ పత్రికల్లో పనిచేశారు ఆయన రన్నింగ్ కామెంటరీ కార్టూన్ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడి సృష్టించింది. 

Tags:    

Similar News