నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు: కేటీఆర్

ఈ రోజు అదనపు కలెక్టర్లకు నూతన పురపాలక చట్టంపై రెండో రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Update: 2020-02-14 14:10 GMT

ఈ రోజు అదనపు కలెక్టర్లకు నూతన పురపాలక చట్టంపై రెండో రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి మర్రి చెన్నారెడ్డి హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ అధికారులు ప్రజల పట్ల నిజాయితీగా నడుచుకోవాలనీ, ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోకుండా వారికి అన్ని విధాలుగా సహకరించాలని అన్నారు. ఇటీవల ప్రారంభించిన పల్లె ప్రగతి విజయవంతమైందని ఆయన తెలిపారు.

ఇదే నేపథ్యంలో పట్టణప్రగతి కార్యక్రమాన్ని చేపడతామని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మంత్రి అధికారులకు తెలిపారు. పట్టణ ప్రగతిని విజయవంతం చేస్తే తెలంగాణ పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వార్డు కమిటీలు ఏర్పాటు చేయాలని, ఇందులో ఎలాంటి పొరపాట్లు చేయకూడదని సూచించారు. పట్టణ ప్రగతి కోసం కొనుగోలు చేసే వాహనాలకు స్టిక్కరింగ్‌ చేయాలని మంత్రి కేటీఆర్‌.. అధికారులకు సూచించారు.

ఇక పోతే ఇండ్ల పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నవారికి 21 రోజుల్లో ఇండ్లకు పర్మిషన్లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనుమతి ఇవ్వకపోతే అందుకు గల కారణం చెప్పాలన్నారు. ఈ విషయాల్లో సరిగ్గా పనిచేయని అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. ఇక దీంతో పాటు టీఎస్‌ బీ పాస్‌పై అధికారులు అవగాహన పెంచుకోవాలని సూచించారు. మున్సిపల్‌ చట్టం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. 

Tags:    

Similar News