BRS: పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్కు మరో అగ్నిపరీక్ష
BRS: పార్లమెంట్ ఎన్నికల్లో పకడ్బందీగా ముందుకు వెళ్లాలని చూస్తున్న కేసీఆర్
BRS: పార్లమెంట్ ఎన్నికలతో బీఆర్ఎస్కు మరో అగ్నిపరీక్ష
BRS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్కు పార్లమెంట్ ఎన్నికల రూపంలో మరో అగ్నిపరీక్ష ఎదురుకాబోతోంది. లోక్సభ ఎన్నికలు కాబట్టి జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నుంచి తీవ్రమైన పోటీ నెలకొనడంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పు పార్లమెంట్ ఎన్నికల్లో దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేక ఉందని తెలిసినా మళ్లీ వారికే టికెట్ ఇచ్చి చేతులు కాల్చుకున్నారు గులాబీ బాస్.
పార్టీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత ఫలితాల్లో స్ఫష్టంగా కనిపించింది. బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్కు పట్టం కట్టారు ఓటర్లు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో పకడ్బందీగా ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ప్రజా వ్యతిరేక ఉన్న సిట్టింగ్ ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో సిట్టింగ్లను పక్కన పెట్టి..కొత్త వారికి ఛాన్స్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్న కేసీఆర్.
2019 లోక్సభ ఎన్నికల్లో సారు..కారు..పదహారు అనే నినాదంతో ముందుకు వెళ్లింది బీఆర్ఎస్. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా..అనుకున్న ఫలితాలను రాబట్టలేకపోయింది. పార్లమెంట్ ఎన్నికలు అంటే దాని ప్రాధమ్యాలు, ఓటర్లు చూసే చూపు కొంత డిఫరెంట్గా ఉంటుంది. జాతీయ అంశాలు తెరపైకి రావడంతో.. కారు పార్టీ 9స్థానాలకే పరిమితం అయింది. 2018లో ఒక్క అసెంబ్లీ సీటుకే పరిమితం అయిన బీజేపీ ఏకంగా 4ఎంపీ స్థానాలు గెలుచుకుంది. అలాగే కాంగ్రెస్ 3 స్థానాల్లో విజయం సాధించింది.
దీంతో ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్కు ఆ రెండు జాతీయ పార్టీ నుంచి మరింత తీవ్రమైన పోటీ ఎదురుకానుంది. పైగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8స్థానాలకు ఎగబాకింది. మరో 18స్థానాల్లో రెండో ప్లేస్లో నిలిచింది. ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రాభల్యం ఎక్కువగా కనిపించింది. ఇటు కాంగ్రెస్ ఏకంగా 64చోట్ల గెలుపొంది. అధికారం దక్కించుకుంది. దక్షిణ తెలంగాణతో పాటు వరంగల్లో కాంగ్రెస్ గాలి వీచింది. తొమ్మిది సిట్టింగ్ లోక్సభ స్థానాల్లో కేవలం, మెదక్, చేవెళ్లలో మాత్రమే బీఆర్ఎస్కు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్కు టఫ్ ఫైటే ఎదురుకాబోతోంది.
ప్రస్తుతం ఉన్న 9మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీల్లో కొందరిని మార్చబోతున్నారనే చర్చ నడుస్తోంది. ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ఎంపీలను పక్కన పెట్టి..కొత్త వారికి చోటు ఇవ్వబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ మూడు స్థానాల్లో అభ్యర్థులపై మాత్రమే గులాబీ బాస్ క్లారిటీ ఇచ్చారు. కరీంనగర్లో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, ఖమ్మం నుంచి నామా నాగేశ్వర రావు అభ్యర్థిత్వాలు దాదాపు ఖరారయ్యాయి. మిగిలిన స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం వేట కొనసాగుతోంది.
నిజామాబాద్లో కవిత పోటీ ఖాయమే అయినప్పటికీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆదిలాబాద్లో గతంలో ఎంపీగా పని చేసిన గొడెం నగేష్ ఇప్పుడు అంతగా యాక్టివ్గా లేరు. వరంగల్ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్కు మరోసారి అవకాశం ఇచ్చే అవకాశాలు దాదాపు కనిపించట్లేదు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ కవితకు అవకాశం ఇస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. మహబూబ్నగర్ సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. దీంతో ఇక్కడ కూడా అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి.
ఇక భువనగిరి నుంచి గతంలో ఎంపీగా పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ ఇప్పుడు బీజేపీ గూటికి చేరారు. పెద్దపల్లి, నాగర్కర్నూలు స్థానాలు బీఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నప్పటికీ.. సిట్టింగ్లకు మరో అవకాశం ఇస్తారా.. లేదా.. అనేది సస్పెన్స్గా మారింది. వీటితో పాటు నల్గొండ, మల్కాజిగిరి, సికింద్రాబాద్ అభ్యర్థులెవరనేది ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల వెలువడిన సర్వే ఫలితాల్లో తెలంగాణలో కాంగ్రెస్.. 9 నుంచి 11స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డాయి. మొత్తం 17స్థానాల్లో ఒకటి ఎంఐఎంకు పోను...మిగిలిన 5స్థానాల్లో బీజేపీ, బీఆర్ఎస్ పంచుకొంటాయని తెలిపాయి. దీంతో బీఆర్ఎస్లో గుబులు స్టార్ట్ అయింది. అందుకే అచితూచి వ్యవహరిస్తూ బలమైన అభ్యర్థుల వేటలో పడ్డారు కేసీఆర్. ప్రజా వ్యతిరేక లేని, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు.