TSRTC: టీఎస్ ఆర్టీసీలో నూతన సంస్కరణలు.. నష్టాలు తగ్గించే దిశగా టీఎస్ ఆర్టీసీ

TSRTC: గతం కంటే పెరిగిన ఆదాయం.. ఈ ఏడాది రూ.5,879 కోట్ల ఆదాయం

Update: 2022-12-30 07:19 GMT

TSRTC: టీఎస్ ఆర్టీసీలో నూతన సంస్కరణలు.. నష్టాలు తగ్గించే దిశగా టీఎస్ ఆర్టీసీ

TSRTC: తెలంగాణ ఆర్టీసీ కరోనా నుంచి క్రమక్రమంగా బయట పడుతూ.. నూతన సంస్కరణల ద్వారా నష్టాలను తగ్గిస్తూ... ముందుకు దూసుకు వెళుతోంది. చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తరువాత కొత్త సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ఆర్టీసీలో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతమవుతున్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 1,350 కోట్ల రూపాయల నష్టాన్ని తగ్గించి 650 కోట్ల రూపాయలకు పరిమితమయ్యేలా సంస్కరణలు చేపట్టారు. ‎ఈ అంశం 2022 సంవత్సరంలో తెలంగాణ ఆర్టీసీ చెప్పుకోదగ్గ పనితీరుతోనే సాధ్యమయింది. ఈ సంవత్సరంలో ఆర్టీసీ చేపట్టిన సంస్కరణలు ఏంటో మనమూ చూద్దాం...!

తెలంగాణ ఆర్టీసీలో చేపట్టిన సంస్కరణలు విజయవంతమవుతున్నాయి. 2022 ముగుస్తున్న సందర్భంగా చైర్మన్ బాజిరెడ్డి, ఎండీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ పురోగతి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సిబ్బంది పనితీరును కొనియాడారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఆర్టీసీ భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ఓవరాల్‌గా 2021లో 3 వేల 311 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ సంవత్సరం ఇప్పటికే 5 వేల 879 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించింది. అంటే 77.56 శాతం అధిక ఆదాయం రాబట్టిందన్నమాట. ఇందులో ప్రయాణికుల తరలించడం, కార్గో, పార్సిల్ ఆదాయం, బస్సులు అద్దెకు ఇవ్వడం లాంటి ఆర్టీసీకి వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం భారీగా పెంచారు. గత సంవత్సరానికి ఇప్పటికీ 4.40 అధిక ఆక్యుపెన్సీ రేటు సైతం సాధించింది.

కరోనా సమయంలో ఆర్టీసీకి 2 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. దీంతో ప్రభుత్వం బడ్జెట్‌లో పెట్టిన 1,500 కోట్ల రూపాయలతో అమలు చేస్తున్న సంస్కరణలు ఎంతో ఉపయోగపడ్డాయని చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ వెల్లడించారు.. తిరుపతికి ప్రతి రోజు వెయ్యి టికెట్లు అందుబాటులో ఉండేలా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. మరోవైపు సింగరేణి దర్శన్‌తో పాటు, హైదరాబాద్ దర్శన్ లాంటి ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశామన్నారు బాజిరెడ్డి మిగితా వివరాలు ఆయన మాటల్లోనే విందాం.

ఆర్టీసీలో ఏడాదికి 1,980 కోట్ల రూపాయలు ఉన్న నష్టాన్ని 650 కోట్ల రూపాయలకు తగ్గించామన్నారు ఎండీ సజ్జనార్. త్వరలోనే స్లీపర్ బస్సులను బెంగుళూరు, ముంబై, షిరిడీ లాంటి దూరపు ప్రాంతాలకు ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు. 22 కోట్ల రూపాయల ఆదాయంతో 2020 లో ప్రారంభమైన కార్గో, పార్సిల్ ఆదాయం 86 కోట్ల రూపాయలకు పైగా ఆర్జించడం శుభపరిణామం అన్నారు సజ్జనార్ మిగితా ఆయన మాటల్లోనే విందాం.

ఓ వైపు విజయవంతంగా సంస్కరణలు కొనసాగుతున్నాయి. వచ్చే సంవత్సరం నాటికి మరో వెయ్యి బస్సులు స్క్రాప్‌కి వెళ్లే అవకాశం ఉండడంతో మరిన్ని కొత్త బస్సులపై ఆర్టీసీ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Tags:    

Similar News