రేపటి అసెంబ్లీ సమావేశాలపై ఉత్కంఠ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై వేటు వేసే అవకాశం
కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్ రెడ్డిపై వేటుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ బడ్డెట్ సమావేశంలో సభలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరనున్నట్లు తెలుస్తోంది.
గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానం తెలిపే క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్గోపాల్రెడ్డి గవర్నర్ ప్రసంగం అంత తప్పుల తడక అంటూ విమర్శించారు. మిషన్భగీరథ నీటిపై సభలో తప్పుడు సమాచారం పెట్టారంటూ గందరగోళం నెలకొంది. అయితే సభలో తప్పుగా మాట్లాడే వారిపై చర్యలు తీసుకోవాలని సభలో సీఎం కేసీఆర్ చెప్పడంతో రాజగోపాల్ రెడ్డిపై వేటుకు రంగం సిద్దం అయినట్లు అనుమానాలు కలుగుతున్నాయి.
బుధవారం అసెంబ్లీ ప్రారంభంకాగానే రాజ్గోపాల్రెడ్డిని ఈ బడ్జెట్ సమావేశాల నుండి సస్పెండ్ చేసే అవకాశం కనపడుతోంది. అయితే ఈ బడ్జెట్ సెషన్స్ వరకే సస్పెండ్ చేస్తారా లేక మొత్తానికే సస్పెండ్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. ప్రగతి భవన్లో కొంత మంది సీనియర్లతో రాజ్గోపాల్రెడ్డి వ్యవహారంపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. సభలో మళ్లీ ఎవరూ ఇలా తప్పుడు సమాచారం ఇవ్వకుండా ఉండాలంటే చర్యలు తీసుకోవాల్సిందేనని సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఒకవేళ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై వేటు వేస్తే తదుపరి పరిణామాలపై అటు కాంగ్రెస్ నేతలు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలను ఎదుర్కోవడానికి పథకాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.