Steel Bridge: 19న వీఎస్టీ.. ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జికి కేటీఆర్ ప్రారంభోత్సవం.. మాజీ మంత్రి నాయిని నర్సింహరెడ్డి వంతెనగా నామకరణం
Steel Bridge: రూ.450కోట్లతో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం
Steel Bridge: హైదరాబాద్లో మరో వంతెన అందుబాటులోకి రానుంది. వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఈ నెల 19న మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. 2.25 కిలోమీటర్లు ఉన్న ఈ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. ఈ వంతెన నిర్మాణానికి దాదాపు 450కోట్లు వెచ్చించి నిర్మించారు. వంతెన అందుబాటులోకి రావడంతో వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి.
ఈ రూట్లో జనావాసాలతో పాటు వాణిజ్య సంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టల్స్, కాలేజీలు ఎక్కువ ఉన్నాయి. దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారు. సమస్య నుంచి గట్టెక్కించేందుకు జీహెచ్ఎంసీ స్టీల్ వంతెన నిర్మించాలని నిర్ణయించింది. అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంతో వాహనదారుల కష్టాలకు తెరపడనుంది. లింగంపల్లి జంక్షన్, అశోక్నగర్ క్రాస్ రోడ్ వద్ద సైతం ట్రాఫిక్ కొంత తగ్గనుందని భావిస్తున్నారు. వంతెనపై ఎల్ఈడీ లైట్లు, క్రాస్ బారియర్ల ఏర్పాటు చేశారు. ఈ వంతెనపై గంటకు 40 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉన్నట్లు ట్రాఫిక్ అధికారులు తెలిపారు. హైదరాబాద్లో SRDP ద్వారా 450 కోట్ల వ్యయంతో చేపట్టిన మొట్ట మొదటి స్టీల్ ఫ్లై ఓవర్గా ఈ బ్రిడ్జ్ నిలిచింది. మిగితా ఫ్లై ఓవర్ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్తో ఈ ఫ్లై ఓవర్ను నిర్మించారు.
వంతెన ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా స్పందించారు. ఆర్టీసీ ఎక్స్రోడ్, అశోక్నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడిగా ఉన్న ట్రాఫిక్ రద్దీ సమస్యను పరిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. వంతెనను ఎస్ఆర్డీపీ కింద జీహెచ్ఎంసీ నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ తొలి హోంమంత్రిగా పని చేసిన నాయిని స్వర్గీయ నర్సింహారెడ్డి పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని కేటీఆర్ పేర్కొన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారని, దశాబ్దాల పాటు వీఎస్టీ కార్మిక సంఘానికి నాయకత్వం వహించారని కేటీఆర్ ట్వీట్ చేశారు.