'దొరల రాజ్యం ఇంకెంత కాలం నడుస్తదో తెల్వదు' : ఎమ్మెల్యే శంకర్ నాయక్
'దొరల రాజ్యం ఇంకెంత కాలం నడుస్తదో తెల్వదు'అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
'దొరల రాజ్యం ఇంకెంత కాలం నడుస్తదో తెల్వదు'అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్లో ఏర్పాటు చేసిన పండ్ల విక్రయ కేంద్రాన్ని సోమవారం మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇతర టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ తాను ఏం మాట్లాడినా తప్పే అంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఈ వ్యాఖ్యలు చేసారు.
మంత్రి కేటీఆర్ చొరవతో మిర్చి నుంచి నూనె తీసే ఫ్యాక్టరీ త్వరలోనే ఏర్పాటు కానుందని చెప్పారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడే సమయంలో మరికొంత మంది నాయకులు కలుగచేసుకుని మాట్లాడుతూ ఆ ఫ్యాక్టరీ పనులు డోర్నకల్ నియోజకవర్గంలో ప్రారంభమయ్యాయని తెలిపారు. ఈ మాటలతో అసహనం వ్యక్తం చేసిన ఎమ్మేల్యే గ్రామాలు, పట్టణాలు అభిచెందాలంటే ప్రధాన కార్యాలయాలు జిల్లా కేంద్రంలో ఉండాలని తెలిపారు.
ఏం రాజ్యాంగమో, ఎవరు కనిపెట్టారో తెలియదు.. అన్నం పెట్టే రైతుకు ప్రతిసారి అన్యాయం జరుగుతోందని మాట్లాడారు. అన్నం లేకుండా ఏ ఒక్కరు బతకలేరని, అలాంటి వరిని పండించే రైతులను మోసం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. రైతులను మోసం చేసేవారికి ఉరి శిక్ష విధించాలన్నారు. విక్రయం చేసే ప్రతి ఒక్క వస్తువుకు తయారు చేసే వారే ధరలను నిర్ణయిస్తారని, మరి రైతుకెందుకు ఆ అవకాశం ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.