హైదరాబాద్ ప్రజలకు నేటి నుంచి ఉచిత తాగునీరు కార్యక్రమం అందుబాటులోకి రానుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ హామీ మేరకు ఇవాళ ఫ్రీ వాటర్ ప్రోగ్రాంకు మంత్రి కేటీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 9.30 నిమిషాలకు బోరబండంలోని ఎస్పీఆర్ హిల్స్, రెహమత్ నగర్లో ఈ కార్యక్రమానికి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ ఉచిత తాగునీటి పథకం కింద నగరంలోని ప్రతీ ఇంటికి 20వేల లీటర్ల తాగునీరు ఉచితంగా అందించనుంది ప్రభుత్వం.
ఈ కార్యక్రమం కింద లబ్ధి పొందే వినియోగదారులు ఆధార్, క్యాన్ నెంబర్ లింకు చేసి మీటర్లు అమర్చుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందుకు మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసింది. మార్చి 31లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.
పథకం అమలు కోసం నగరంలోని ఇళ్లను మూడు రకాలుగా విభజించారు అధికారులు. మురికివాడల్లో లక్షా 96 వేల మందికి ఉచిత నీరు అందనుండగా 7 లక్షల 87 వేల వ్యక్తిగత గృహ వినియోగదారులు లబ్ధి పొందుతారు. ఇక అపార్ట్మెంట్ల లాంటి బల్క్ నీటి వినియోగదారులు కలిపి దాదాపు పదిన్నర లక్షల కనెక్షన్లు రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో స్లమ్స్లో వారికి మీటర్లు అమర్చాల్సిన అవసరం లేదని తెలిపింది ప్రభుత్వం.