Telangana: ఈటలపై సెటైర్లు వేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి

Telangana: మంత్రి ఈటలతో కేసీఆర్ పార్టీ పెట్టించే అవకాశం లేకపోలేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Update: 2021-03-28 10:10 GMT

తెలంగాణ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Telangana: బయట తిడుతుండు.. మళ్లీ లోపలికి వెళ్తున్నాడంటూ మంత్రి ఈటల పై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి సెటైర్లు వేశారు. మంత్రి ఈటలతో కేసీఆర్ పార్టీ పెట్టించే అవకాశం లేకపోలేదని కొండా అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో కొండా మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తానని తెలిపారు. తెలంగాణలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉండకపోవచ్చని, అయితే టీఆర్ఎస్‌పై పోరాటం చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త పార్టీ ఏర్పాటు చేయాలా లేదా ఎవరైనా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే వారితో కలిసి పనిచేయాలా లేదా ఏ పార్టీలో చేరాలా అనే విషయంపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు.

కేసీఆర్ తనను రాజకీయాల్లో రావాలని మూడేళ్లు వెంటపడితే రాజకీయాల్లోకి వచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చినట్టుగా ఆయన తెలిపారు. కాంగ్రెస్‌ను వీడి పది రోజులు అయిందన్నారు. తెలంగాణలో బలమైన ప్రతిపక్షం ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణలో రీజినల్ పార్టీలు ఎక్కువైతే మళ్లీ టీఆర్ఎస్‌కే లాభమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో అనేక గ్రూపులున్నాయన్నారు. ఎన్నికలకు ముందు సగం మంది కాంగ్రెస్ నేతలు అమ్ముడుపోయారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.అందరితో మాట్లాడి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకొంటానని ఆయన చెప్పారు. 

Tags:    

Similar News