నేడు మల్లన్న అగ్ని గుండాలు.. ముగింపు దశకు చేరుకున్న బ్రహ్మోత్సవాలు...

Siddipet: బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు...

Update: 2022-03-27 01:58 GMT

నేడు మల్లన్న అగ్ని గుండాలు.. ముగింపు దశకు చేరుకున్న బ్రహ్మోత్సవాలు...

Siddipet: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఇవాళ మల్లన్న క్షేత్రంలో కల్యాణవేదిక వద్ద అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో మొత్తం 11 ఆదివారాలు ఉత్సవాలను అర్చకులు నిర్ణయించారు. చివరి ఆదివారం నిర్వహించే అగ్నిగుండాలకు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఆలయ వర్గాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. కల్యాణ వేదిక ప్రాంగణంలో పెద్ద అగ్నిగుండం తయారు చేయడంతో పాటు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నిర్వహించే అగ్నిగుండాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.

చివరి వారం కావడంతో స్వస్తిశ్రీ ప్లవ నామ సంవత్సరం పాల్గుణ ఏకాదశి ఆదివారం రాత్రి 7 గంటలకు వీరభద్ర ప్రస్తాయం, భద్రకాళి పూజ, రాత్రి 11 గంటలు అగ్నిగుండాల ప్రజ్వలన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 28న ఉదయం 5 గంటలకు గురుపూజ, బలిహరణం, అగ్నిగుండాల ప్రవేశం, విజయోత్సవం, ఉదయం 11 గంటలకు మల్లికార్జునస్వామి, అమ్మవార్లకు ఏకాదశ రుద్రాభిషేకం, మహామంగళహారతి, మంత్రపుష్పం, జంగమార్చాన, అనంతరం తీర్థప్రసాద వితరణ చేయనున్నారు.

మల్లన్న ఆలయవర్గాల ఆధ్వర్యంలో అగ్నిగుండాల కార్యక్రామనికి అన్ని చర్యలు చేపట్టారు. అగ్నిగుండం తయారు చేసేందుకు ఐదు రకాల పళ్లవాలను ఆలయంలో సమకూర్చారు. మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి కర్రలను ఒక్కచోట చేర్చి ప్రత్యేక పూజలు చేసి, వాటిని అంటించి అగ్నిగుండంగా తయారు చేస్తారు. అర్చకులు స్వామి వారి ఉత్సవ విగ్రహాలను అగ్నిగుండం వద్దకు తీసుకొచ్చి దాటుతారు. అనంతరం భక్తులు అగ్నిగుండం దాటి మల్లికార్జునస్వామి వారిని దర్శనం చేసుకుంటారు. ఆలయ పాలక మండలి ఛైర్మన్, కమిటీ సభ్యులు, ఈవో, అర్చకులు, ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో విస్త్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కల్యాణ వేదిక ప్రాంతంలో పెద్ద అగ్నిగుండం తయారు చేయడంతో పాటు భక్తులు వీక్షించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News