మహబూబాబాద్ జిల్లా కేసముద్రం-ఇంటికన్నె రైల్వేస్టేషన్ల మధ్య విద్యుత్ తీగ తెగి పోవడంతో మణుగూరు నుంచి కొల్హాపూర్ వెళ్లే కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. కేసముద్రం రైల్వేస్టేషన్ నుంచి బయలుదేరిన కొల్హాపూర్ ఎక్స్ప్రెస్ ఇంటికన్నె రైల్వేస్టేషన్ సమీపిస్తుండగా ఇంజిన్పై యాంటెనా, ఓహెచ్ఈ తీగకు అనుసంధానంగా ఉన్న జంపర్ తెగిపోయి రైలు బోగీకి తగిలింది. దీంతో ఒక్కసారిగా మంటలు, పొగలు బోగీలోకి కమ్ముకోవడంతో ప్రయాణికులు భయపడ్డారు.
కదులుతున్న రైలు నుంచి కొందరు ప్రయాణికులు దూకేందుకు ప్రయత్నం చేయగా అప్రమత్తమైన యువకులు వారిని అడ్డుకొని చైన్ లాగారు. నిలిచిన రైలు నుంచి ప్రయాణికులు ఆర్తనాదాలు చేస్తూ పరుగులు పెట్టారు. ప్రాణాపాయం లేకపోవడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఖాజీపేట జంక్షన్ నుంచి డీజిల్ ఇంజిన్ను రప్పించి కొల్హాపూర్ ఎక్స్ప్రెస్కు తగిలించడంతో రాత్రి ఒంటి గంట తర్వాత రైలు కదిలింది.