తెలంగాణ తొలి సీజేగా జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణస్వీకారం

Update: 2019-01-01 03:47 GMT

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ తొట్టతిల్‌ బి. రాధాకృష్ణన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్తో ప్రమాణ స్వీకారం చేపించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. కేరళలోని కొల్లాంలో 1959, ఏప్రిల్‌ 29న జన్మించిన రాధాకృష్ణన్.. అక్కడే పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తరువాత కర్ణాటకలోని కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్‌ లా కాలేజీ నుంచి లాయర్‌ పట్టా సాధించారు.

తిరువనంతపురంలో 1983లో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించారు. రెండుసార్లు కేరళ హైకోర్టుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. గతేడాది మార్చి 18న ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఏపీ, తెలంగాణకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటు కావడంతో తెలంగాణ చీఫ్ జస్టిస్‌గా రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. అయితే అంతకుముందే గతేడాది జూలైలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు.  

Similar News