Telangana CPM: తెలంగాణ రాష్ట్ర సీపీఎం కార్యదర్శిగా జాన్ వెస్లీ.. తొలిసారి దళిత నాయకుడికి అవకాశం
Telangana CPM: సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా తొలిసారి దళిత నాయకుడు ఎన్నికయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జాన్ వెస్లీని రాష్ట్ర కార్యదర్శి పదవికి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఎన్నుకుంది.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 25 నుంచి 28వ తేదీ వరకు వరకు స్థానిక గోకుల్ గార్డెన్ లో సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలు జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన మహాసభలో ప్రజా సమస్యలపై అనేక తీర్మానాలను ఆమోదించారు. ముగింపు రోజు పార్టీ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకును్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికయ్యారు.
60 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా 14 మంది రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన జాన్ వెస్లీ సీపీఐఎం పార్టీలో 30ఏళ్లకు పైగా పలు బాధ్యతల్లో పనిచేస్తున్నారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులుగా పనిచేసిన ఆయన సామాజిక న్యాయ సాధన కోసం సీపీఐఎం అనుబంధంగా ఉన్న కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పాటు పనిచేశారు.
ఆర్థిక దోపిడికి వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం వర్గ ఉద్యమాలతో పాటు సామాజిక పోరాటాలు నడుపుతున్న సీపీఎం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా దళితుడిని రాష్ట్ర కార్యదర్శిగా చేసిన కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.