Hyderabad: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. మీ ప్రాంతం ఏ కార్పొరేషన్‌లోకి వస్తుందో తెలుసా?

హైదరాబాద్ మహానగర పాలనలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి

Update: 2025-12-31 06:27 GMT

Hyderabad: మూడు కార్పొరేషన్లుగా హైదరాబాద్ మహానగరం.. మీ ప్రాంతం ఏ కార్పొరేషన్‌లోకి వస్తుందో తెలుసా?

హైదరాబాద్ మహానగర పాలనలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. పెరుగుతున్న జనాభా, వేగంగా విస్తరిస్తున్న నగరాన్ని సమర్థవంతంగా పాలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC)ను మూడు స్వతంత్ర కార్పొరేషన్లుగా విభజించేందుకు నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పేర్లతో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నిర్ణయంపై జనవరి 2న జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించిన సుమారు 2071 చదరపు కిలోమీటర్ల కోర్ అర్బన్ రీజియన్‌ను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బల్దియా విభజనతో పౌర సేవలు ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

మూడు కార్పొరేషన్ల పరిధి ఇలా..

ప్రభుత్వ నివేదికల ప్రకారం ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ స్థానంలో మూడు కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడనున్నాయి.

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

నగర కేంద్ర ప్రాంతాలు ఈ కార్పొరేషన్ పరిధిలోకి రానున్నాయి. సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట నుంచి శంషాబాద్ వరకు విస్తరించి మొత్తం 150 డివిజన్లతో ఈ కార్పొరేషన్ ఏర్పాటుకానుంది. పాతబస్తీతో పాటు సెంట్రల్ హైదరాబాద్‌లోని కీలక ప్రాంతాలు ఇందులో ఉంటాయి.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

ఐటీ హబ్‌గా పేరొందిన పశ్చిమ హైదరాబాద్ మొత్తం సైబరాబాద్ పరిధిలోకి వస్తుంది. నార్సింగి నుంచి శామీర్‌పేట జీనోమ్ వ్యాలీ వరకు విస్తరించి 74 డివిజన్లతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు కానుంది.

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్

ఉత్తర, తూర్పు హైదరాబాద్ ప్రాంతాలను కలుపుతూ కీసర నుంచి పెద్ద అంబర్‌పేట వరకు 76 డివిజన్లతో మల్కాజిగిరి కార్పొరేషన్ ఏర్పడనుంది.

ఏ ప్రాంతం ఏ కార్పొరేషన్‌లోకి?

హైదరాబాద్ కార్పొరేషన్:

చార్మినార్, ఫలక్‌నుమా, కోఠి, అబిడ్స్, నాంపల్లి, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, శంషాబాద్, బడంగ్‌పేట తదితర ప్రాంతాలు.

సైబరాబాద్ కార్పొరేషన్:

మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీ, మణికొండ, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, జీనోమ్ వ్యాలీ ప్రాంతాలు.

మల్కాజిగిరి కార్పొరేషన్:

మల్కాజిగిరి, అల్వాల్, ఉప్పల్, నాగోల్, కాప్రా, ఈసీఐఎల్, ఘట్‌కేసర్, కీసర, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ తదితర ప్రాంతాలు.

కొత్త కమిషనర్ల నియామకం

కొత్త కార్పొరేషన్లు అధికారికంగా ఏర్పడేలోపే పాలనను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను అదనపు కమిషనర్లుగా నియమించింది. సైబరాబాద్ పరిధిలోని జోన్లకు జి. సృజనను, మల్కాజిగిరి పరిధిలోని జోన్లకు టి. వినయ్ కృష్ణారెడ్డిని నియమించారు. కార్పొరేషన్లు ఏర్పడిన తర్వాత వీరే కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కొనసాగనున్నారు.

అలాగే ‘ఫ్యూచర్ సిటీ’ కమిషనరేట్ నిర్మాణం కోసం ప్రభుత్వం 30 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ విభజనకు సంబంధించిన తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది.

Tags:    

Similar News