11 ఏళ్ల తర్వాత వరద నీటితో నిండిన ప్రాజెక్టులు.. వానలతో తీవ్ర నష్టాలను చవి చూసిన ప్రజలు

Update: 2020-08-20 01:53 GMT

Heavy Rain In Mahabubnagar: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్ని జలకళతో కలకలలాడుతున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఇవి రైతులకు, జిల్లావాసులకు ఓ వైపు సంతోషాన్నిస్తున్నా నాలుగు రోజులుగా నిర్విరామంగా కురుసిన వర్షాలు పలువురిని నిరాశ్రయులుగా మార్చాయి. వేలాది పంటలు, ఇళ్లు దెబ్బతినడంతో అతివృష్టి అనావృష్టి అన్న చందంగా మారింది జిల్లా ప్రజల పరిస్థితి.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 11 ఏళ్ల తర్వాత ప్రాజెక్టులన్ని జలకళతో దర్శనమిస్తున్నాయి. కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దానికి తోడు నాలుగు రోజుల పాటు నిర్విరామంగా వర్షాలు కురవడంతో జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. ఐతే అటు అతివృష్టి ఇటు అనావృష్టి అన్న చందంగా ఇప్పుడు కురుస్తున్న వానలు ప్రజలకు సంతోషంతో పాటు తీవ్ర నష్టాలను కూడా చవి చూసేలా చేశాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు కురిసిన ముసురు వర్షాలకు దాదాపు 1500 ఇళ్లు కూలిపోయాయి. దీంతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిరాశ్రయులను అధికారులు ఆయా పాఠశాలల్లోనూ, ప్రభుత్వ భవనాల్లోనూ పునరావాసం కల్పించి ఆహారం అందిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 458, నాగర్ కర్నూల్ జిల్లాలో 347, నారాయణపేట జిల్లాలో 211, వనపర్తిలో జిల్లాలో 206, జోగులాంబ గద్వాల జిల్లాలో 255 ఇళ్లు కూలిపోయినట్టు అధికారులు గుర్తించారు. అంతే కాకుండా తెలకపల్లి మండలం రాకొండ గ్రామంలో ఇళ్లు కూలి తల్లి కూతుళ్లు మృతి చెందారు. ఈ ముసురు వర్షాలకు ఇళ్లు కూలి పోవడమే కాకుండా వేల ఎకరాల్లో పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం వరకు 32.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఐతే ఇంకా వర్షాలు కురిసే అవకాశాలుండటంతో పాత ఇళ్లపై అధికారులు దృష్టి సారించారు. గత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14,137 పాత ఇళ్లు ఉన్నట్టు అధికారుల గుర్తించారు. ఇక నదీ పరివాహక ప్రాంతాల్లో, వాగులు, వంకల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, అధికారులు జాగ్రత్తలు చెప్తున్నారు.


Tags:    

Similar News