దివ్యాంగుడికి మాజీ ఎంపీ కవిత ఆపన్నహస్తం

Update: 2020-08-29 09:37 GMT

Kalvakuntla Kavitha: దివ్యాంగుడికి మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆపన్న హస్తం అందించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి నడవలేని‌ స్థితికి చేరిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన యువకుడు వినయ్‌కి మాజీ ఎంపీ కవిత మూడు చక్రాల స్కూటీని అందించారు. వినయ్ దినావస్థపై ఇటీవల ఓ పత్రికలో వచ్చిన కథనానికి చలించిన ఆమె అతడితో నేరుగా మాట్లాడి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. హైదరాబాద్‌లో కోరుట్ల‌ ఎమ్మెల్యే విద్యా సాగర్‌రావుతో కలిసి వినయ్‌కు మూడు చక్రాల స్కూటీని అందించి అతడి తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు.

కోరుట్లలోని భీమునిదుబ్బ పోచమ్మగుడి సమీపంలో ఉంటున్న బోగ గణేశ్‌-సువర్ణ దంపతుల కుమారుడు వినయ్‌. చిన్ననాటి నుంచి చదువు ల్లో రాణించి మంచి ర్యాంకులు సాధించాడు. హైదరాబాద్‌లోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో 2014లో బీటెక్‌ పూర్తి చేశాడు. ఇంటికి వచ్చిన వినయ్‌ తన అక్కను వారింట్లో దింపడానికి వెళ్లి వస్తున్న సమయంలో ద్విచక్రవాహనం అదుపుతప్పి పడిపోయాడు. వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లో శస్త్రచికిత్స చేయించగా రూ.18 లక్షల వరకు ఖర్చుయయ్యాయి. అయినా పరిస్థితి మెరుగుపడకపోవడంతో ఆరేండ్లుగా వీల్‌చైర్‌కే పరిమితమవడంతో తల్లిదండ్రులు తీవ్రంగా మనోవేదనలో ఉన్నారు. వినయ్‌ పరిస్థితిని గమనించి సాయం అందించిన మాజీ ఎంపీ కవితకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






Tags:    

Similar News