రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరికి రానే వచ్చింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఎన్నికలకు కావలసిన ఏర్పాట్లను పూర్తి చేసామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) కార్యదర్శి ఎం.అశోక్కుమార్ తెలిపారు. ఈ నెల 22న 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో ఎన్నికలు జరగనున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7,961 పోలింగ్ స్టేషన్లను, 52,757 మంది పోలింగ్ సిబ్బందిని ఏర్పాటుచేసారు. సిబ్బందిని ర్యాండమైజ్ చేసి శిక్షణ కూడా ఇచ్చారని తెలిపారు. వారిలో 40 వేల మంది విధులు నిర్వహిస్తారు. కౌంటింగ్కు 5 వేల మందిని నియమించామని స్పష్టం చేసారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఇద్దరేసి పోలీసులు ఉంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 53,55,942 ఓటర్లున్నారన్నారు.
అంతే కాక ఎవరైనా రిగ్గింగ్ కు పాల్పడినా, ఎక్కడైనా ఒక్క దొంగ ఓటు పడినా రీపోలింగ్ నిర్వహించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు. ఎన్నికలు జరగనున్న ప్రాంతాల్లో పోలింగ్ రోజు సెలవు ఉంటుందని తెలిపారు. ఆ రోజుకు వేతనం కూడా చెల్లిస్తామని తెలిపారు. వీటి పరిధిలో ఏవైనా ఐటీ సంస్థలు ఉన్నా లోకల్ హాలిడే ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
అంతే కాక వేరే ప్రాంతాల్లో పనిచేసే ఓటర్లకు వారి కంపెనీలు 2, 3 గంటల పాటు ఓటు వేయడానికి పర్మిషన్ ఇవ్వాలని యాజమాన్యాలను కోరామన్నారు. బ్యాలెట్ పత్రాల ముద్రణలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, 21న నిశితంగా వాటిని పరిశీలించాకే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్బూత్లకు తీసుకు వెళ్లేలా చూస్తున్నామన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఈ ఎన్నికల్లో ఐనా ఓటింగ్ శాతాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.