Nirmal: జిల్లాలో 204 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: అదనపు కలెక్టర్ ఏ.భాస్కర్ రావు
జిల్లాలో 204 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు తెలిపారు.
నిర్మల్: జిల్లాలో 204 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసామని, జిల్లా అదనపు కలెక్టర్ ఏ భాస్కర్ రావు తెలిపారు. రబీ సీజన్ లో కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించడానికి లారీలను (ట్రక్కులను) సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఆదివారం అదనపు కలెక్టర్ ఛాంబర్ లో పౌరసరఫరాలు, పోలీసు, రవాణా, నిర్మల్ భైంసా ఖానాపూర్ క్లస్టర్ల వరి ధాన్యం రవాణా లారీ కాంట్రాక్టర్ల లతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లాలో 2 లక్షల 41 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వస్తుందని అంచనా వేయడం జరిగిందని, ఇందుకోసం 204 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యం ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు, తమ ట్రక్కులను సిద్ధంగా ఉంచాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. జిల్లాలో లాక్ డౌన్ ఉన్నందున ట్రక్కు డ్రైవర్లు, క్లీనర్ లకు ఇబ్బందులు కలగకుండా, పోలీస్ శాఖ ద్వారా పాసులు ఇప్పించడం జరుగుతుందన్నారు. ట్రక్కుల పై "వరి సేకరణ ట్రక్కులు" అనే బ్యానర్లు పెట్టాలన్నారు. ట్రక్కులకు ఏమైనా రిపేర్లు కావలసి వస్తే, రిపేర్ షాప్ లను ఓపెన్ చేయించడం జరుగుతుందని అన్నారు.
కొనుగోలు చేసిన ధాన్యాన్ని సేకరించేందుకు రైస్ మిల్లులవారు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి , జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్ కుమార్, సహాయ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్, సివిల్ సప్లై కార్పొరేషన్ మేనేజర్ శ్రీకళ, ట్రాక్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.