రేపు GHMC పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
*11,700 డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి శ్రీకారం
రేపు GHMC పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
Double Bedroom Houses: పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. పేదలకు ఇళ్లను కేటాయించే ప్రక్రియను సర్కార్ వేగవంతం చేసింది. నిర్మాణం పూర్తయిన ఇళ్లను రేపటి నుంచి అర్హులైన లబ్ధిదారులకు అందించనున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో 24 నియోజకవర్గాల్లో 11 వేల 700 మంది లబ్దిదారులకు డిగ్నిటీ డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 500 చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని తొమ్మిది లొకేషన్లలో రాష్ట్ర మంత్రులు, మేయర్, డిప్యూటీ స్పీకర్ ఆయా నియోజకవర్గాల్లో ఎంపిక చేసిన ఇళ్లను లాటరీ ద్వారా కేటాయిస్తారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బహదూర్పల్లిలో జరిగే పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొంటారు. పఠాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూర్ లొకేషన్లో నిర్మించిన ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు పాల్గొననున్నారు. మంఖాల్-1 లొకేషన్లో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
మరో వైపు హోంశాఖ మంత్రి మహమూద్ అలీ బహదూర్పురా నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. సమాచారశాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పాల్గొననున్నారు. ఇటు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని నల్లగండ్లలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించనున్నారు.