తెలంగాణ యాపిల్ త్వరలో మార్కెట్లోకి...
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండే పంటలు వరి, మొక్క జొన్న, మిర్చి. కాని ఇప్పుడు మరో పంట కూడా తెరమీదికి వొచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా పండే పంటలు వరి, మొక్క జొన్న, మిర్చి. కాని ఇప్పుడు మరో పంట కూడా తెరమీదికి వొచ్చింది. చల్లని వాతావరణంలో మాత్రమే పండే ఆపిల్ ఇప్పుడు తెలంగణాలో కూడా సాగు చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ఈ పంట మార్కెట్లోకి రానున్నది. రాష్ట్ర ప్రజలు సొంత గడ్డపై కాసిన ఫలాల రుచిని ఆస్వాదించే అవకాశమున్నది. పూర్తి వివరాల్లోకెళ్తే కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం ధనోరాకు చెందిన రైతు కేంద్రె బాలాజీ ఆపిల్ తోటను సాగు చేశాడు. రాజమండ్రిలోని ఓ నర్సరీ నుంచి బాలాజీ పది యాపిల్ మొక్కలు తీసుకొచ్చి నాటాడు. తన స్నేహితుడి సలహాతో, తనకున్న పరిజ్ఞానంతో తోటకు అనుకూలమైన వాతావరణం కల్పించి ఏపుగా పెంచాడు.
యాపిల్ సాగుపై పరిశోధన చేస్తున్న హైదరాబాద్లోని సీసీఎంబీ శాస్త్రవేత్తలు కూడా తమ వంతు ప్రోత్సాహం అందించారు. 2014లో ఈ భూమిలో సాగుకు అనుకూలమైన హరిమ న్ రకానికి చెందిన 150 మొక్కలను ఇచ్చి సలహాలు సూచనలు ఇచ్చారు. అదేవిధంగా 2016లో వ్యవసాయశాఖ మరో 300 మొక్కలు ఇవ్వగా నాటాడు. మూడు సంవత్సరాలు కాసిన కాయలను కోయకుండా చెట్టుకు అలాగే వదిలేశాడు. ఈ ఏడాది కాసిన కాయలు ప్రస్తుతం 200 గ్రాముల పరిమాణానికి చేరాయి. మరికొన్ని రోజుల్లో 250 గ్రాముల బరువు వచ్చే అవకాశం ఉన్నది. ఇవి ఎర్రగా కశ్మీర్ యాపిల్ను తలపిస్తున్నాయి.